హైదరాబాద్ 'ప్రత్యేకం': దానం, టి నేతలకు ఢిల్లీ ప్రశ్నలు
న్యూఢిల్లీ: హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసేందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించమని, తెలంగాణలో కలపలేని పరిస్థితి ఉంటే రాజధానిని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని మంత్రులు దానం నాగేందర్, ముఖేష్ గౌడ్లు డిమాండ్ చేశారు. విభజన జరిగితే హైదరాబాదును తెలంగాణ ప్రాంతంలోనే ఉంచాలని, కుదరకుంటే మాత్రం ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని, నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు కూడా అదే కోరుకుంటున్నారన్నారు.
తాము విభజనపై అన్ని పార్టీలకు చెందిన వారిని కలిశామని, వారి అభిప్రాయాన్ని ఆంటోనీ కమిటికీ చెబుతామన్నారు. హైదరాబాదులో ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పోరేటర్స్తో కూడిన స్థానిక పాలనకే తాము మొగ్గు చూపుతున్నామన్నారు. హైదరాబాదు పైన తమకు పూర్తి స్పష్టత కావాలన్నారు. హైదరాబాదును యూటిగా చేసిన పక్షంలో ఆందోళనలు చెలరేగుతాయన్నారు.
హైదరాబాద్పై 'ప్రత్యేక' ఆలోచన!
కాంగ్రెసు పార్టీ అధిష్టానం హైదరాబాదుపై ప్రత్యేక ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో రాయల తెలంగాణను సజీవంగా ఉంచుతోంది. తెలంగాణ ప్రాంత నేతలు ఆంటోని కమిటీని కలిసినప్పుడు పెద్దల నుండి రెండు ప్రశ్నలు వారికి ఎదురైనట్లుగా తెలుస్తోంది.
హైదరాబాదుపై మేం తీసుకునే నిర్ణయానికి మీరు కట్టుబడి ఉంటారా? అని, కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్లు వస్తున్నాయి కదా... దీనిపై ఏం చేద్దామని ఆరా తీసినట్లుగా సమాచారం. అదే సమయంలో హైదరాబాదులోని సీమాంధ్ర ప్రజలకు ఎలా భద్రతనిస్తారని ప్రశ్నించారట. వారి ఉపాధి, ఉద్యోగాలకు రక్షణ కల్పించేందుకు ఏం చర్యలు తీసుకుంటారని, సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమ తీవ్రతను ఎలా తగ్గిస్తారని, తామేం చర్యలు తీసుకోవాలని టి నేతలను ఆంటోనీ కమిటీ సభ్యులు ప్రశ్నించారు.