రాఖీ పౌర్ణమి సందడి, మహిళ రక్షాబంధన్ (ఫొటోలు)
హైదరాబాద్: ప్రతి శ్రావణ మాస పౌర్ణమి రోజున ఈ రాఖీ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ పండుగ సాధారణంగా సోదరభావానికి సంబందించింది.అన్నకు చెల్లెలు రాఖీ (రక్షాబంధనం ) కట్టి తనకు రక్షగా ఉండాలని కోరుతుంది. చారిత్రకంగా దీనికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. గ్రీకు దేశస్తుడు అలెగ్జాండర్ భార్య , మన భారత దేశాన్ని పరిపాలిస్తున్ పురుషోత్తమునికి రాఖీ కడుతుంది. ఇది ఆ దేశపు రాచరిక సాంప్రదాయం.అన్నా చెల్లెళ్ళ సంబంధాన్ని నిశ్చయంగా తెలియ చెప్పే పండుగ.
హైందవ సాంప్రదాయములో ఈ పండుగకు ఎక్కువ స్థానమే ఉంది. అమ్మాయిలు ఎక్కుడున్నా సరే ఆ రోజు తమ అన్నాదమ్ములను కలిసి వారికి రాఖీలు కట్టి తీపిపదార్థాలు తినిపిస్తారు. ఈ పండుగనాడు ప్రతి పాఠశాల విద్యార్ధుల చేత జైళ్ళలో ఉన్న ఖైదీలకు కూడా రాఖీలు కట్టించి మిఠాయిలు పంచిపెట్టే సాంప్రదాయం కూడా ఆచరణలోకి వచ్చింది.
రాఖీ పౌర్ణమికి సంబంధించి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. రాక్షస రాజయిన బలిచక్రవర్తి తన భక్తితో శ్రీహరిని తన ఇంట్లో బంధిస్తాడు. అప్పుడు మహాలక్ష్మి ఓ సామాన్య స్త్రీగా మారి బలిచక్రవర్తి ఇంటికి వచ్చి అతన్ని సోదరునిగా భావించి చేతికి రక్షాబంధన్ను కడుతుంది. దీంతో ఏమి బహుమతి కావాలో కోరుకోవాలని చక్రవర్తి అడుడుతాడు. వెంటనే మహాలక్ష్మి తన నిజస్వరూపంలోకి వచ్చి తన స్వామిని విడిచి పెట్టాలని కోరుతుంది. దీంతో బలిచక్రవర్తి శ్రీహరిని విడిచిపెడతాడు. మరిన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి.
గవర్నర్ చేతికి చిన్నారి రాఖీ
గవర్నర్ నరసింహన్ చేతికి ఓ చిన్నారి రాఖీ కడుతూ ఇలా కనిపించింది. ఆ పాపను ముద్దు చేస్తూ గవర్నర్ ఇలా..
నరసింహన్ చేతికి రాఖీ
గవర్నర్ నరసింహన్ రాజభవన్లో పండుగ జరుపుకున్నారు. ఆయన చేతికి ఓ మహిళ ఇలా రాఖీ కడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.
పాఠశాల పిల్లలతో గవర్నర్
గవర్నర్ నరసింహన్కు పాఠశాల పిల్లలు రాఖీ కడుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు. గవర్నర్ సతీమణి కూడా చిత్రంలో ఉన్నారు.
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాఖీ పౌర్ణమి జరుపుకున్నారు. ఆయన చేతికి పిల్లలు రాఖీ కడుతూ ఆనందాన్ని ఆయనతో పంచుకున్నారు.
అన్నాచెల్లెళ్ల అనురాగానికి ప్రతీక
అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే ప్రేమానురాగాలకు సూచికగా జరుపుకునే పండుగను 'రాఖీ' లేదా 'రక్షాబంధన్' అంటారు. దీనికి 'రాఖీ పౌర్ణమి' అనే పేరు ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు.
రక్షణగా నిలవాలని ఆకాంక్ష
సోదరులకు ప్రేమ సూచకంగా సోదరి రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ముఖ్యోద్ధేశం. జీవితాంతం తమకు రక్షణ కల్పించాలనే ఆకాంక్ష ఇందులో ఉంది. ఉమ్మడి కుటుంబాల్లో రక్షాబంధన్కు అత్యంత ప్రాముఖ్యత ఉండేది.
పౌరాణిక గాధ
శ్రీకృష్ణుడికి మణికట్టు వద్ద దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ద్రౌపది తన చీర చించి కట్టుకడుతుంది. కౌరవ సభలో దుశ్శాసనుడు ద్రౌపదిని చీరలాగుతుండగా శ్రీకృష్ణుడు చీరను ఇచ్చి ఆమె గౌరవాన్ని కాపాడుతాడు. దీనికి ప్రతీకగా కూడా రక్షాబంధన్ను భావిస్తారు.
చారిత్రక గాధ
కర్ణావతి అనే మహిళ చిత్తోర్గడ్ రాణిగా ఉండేది. భర్త అకాల మరణంతో రాజ్యభారం ఆమె మీద పడుతుంది. దీంతో ఇది సరైన సమయంగా భావించిన గుజరాత్ సుల్తాన్ బహుదూర్ షా చిత్తోర్ గడ్పై తన సేనలతో దండెత్తుతాడు. అతనిని ఎదుర్కొనేందుకు ఏమి చేయాలో పాలుపోని కర్ణావతి సాయం చేయాలని కోరుతూ మొఘల్ చక్రవర్తి హుమాయూన్కు ఒక రాఖీని పంపుతుంది. ఈ రాఖీతో కర్ణావతిని తన సోదరిగా భావించిన చక్రవర్తి ఆమెకు అండగా నిలువడమే కాకుండా బహుదూర్షాను యుద్ధంతో ఓడిస్తాడు.
రక్తపాతాన్ని ఆపాయి..
చరిత్ర పుటలను తిరిగేస్తే సోదర భావంతో పంపిన రాఖీలు యుద్ధాలను ఆపాయి. రక్తపాతాన్ని నివారించాయి. రాజ్యాలు కూలిపోకుండా చేశాయి. సరికొత్త అనుబంధాలను సృష్టించాయని అర్థమవుతోంది. శాంతిసామరస్యాలను ఈ పండుగ ప్రతిబింబిస్తుంది.