ఉగ్రవాది తుండాపై కోర్టు వద్ద దాడి, పలువురి అరెస్టు
న్యూఢిల్లీ: లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం తుండా పైన మంగళవారం దాడి జరిగింది. ఈ రోజు తుండాను పోలీసులు పాటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్లో హాజరుపర్చేందుకు తీసుకు వచ్చారు. ఈ సమయంలో తుండా పైన దాడికి పాల్పడ్డారు. అనంతరం పోలీసులు తుండా పైన దాడి చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల తుండాను కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది. కస్టడీ పూర్తైన అనంతరం ఈ రోజు పొడిగింపు కోరుతూ పోలీసులు అతనిని కోర్టులో హాజరుపర్చారు. ఆయన కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడిగించింది.
కాగా, భారత్లో ఉగ్రవాద పేలుళ్ల కోసం రెండు దశాబ్దాలుగా బాంబులు తయారు చేస్తున్న కరడుగట్టిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీమ్ తుండాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. భారత్ వెతుకుతున్న కరుడుగట్టిన లష్కరే తోయిబా ఉగ్రవాదుల్లో తుండా అలియాస్ అబ్దుల్ ఖుద్దూస్ ఒకడు.
నిఘా వర్గాల సమాచారంతో నేపాల్ సరిహద్దుల్లో అతణ్ని పోలీసులు పట్టుకున్నారు. బాంబుల తయారీలో సిద్ధహస్తుడైన 70 ఏళ్ల తుండా భారత్లో 40కి పైగా బాంబు పేలుళ్లలో కీలక పాత్ర పోషించాడు. 26/11 ముంబై ఉగ్రదాడుల తర్వాత పాక్కు భారత్ అందించిన మోస్ట్ వాంటెడ్ టాప్ 20 ఉగ్రవాదుల జాబితాలో తుండా కూడా ఉన్నాడు.
బాంబులు తయారు చేయడంలో సిద్ధహస్తుడైన అబ్దుల్ కరీం చేతిలో బాంబు పేలి ఎడమ చేయి పోగొట్టుకున్నాడు. అప్పటి నుండి తుండాగా ప్రసిద్ధుడయ్యాడు. తుండా అంటే మొండి అని అర్థం. ఎక్కడికక్కడ స్థానికంగా లభించే రసాయన పదార్థాలను ఉపయోగించి బాంబులు తయారీలో యువతకు శిక్షణ ఇచ్చేవాడని పోలీసులు తెలిపారు. తుండాను ఢిల్లీ కోర్టు మూడు రోజుల పోలీసు కస్టడీకి అప్పగించింది.