నాలుగు నెలలుగా బంగళాలోనే షీలా రెడ్డి శవం
బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్లోని భారీ భవంతిలో ఓ 53 ఏళ్ల మహిళ శవం నాలుగు నెలలుగా పడి ఉంది. శవం దాదాపుగా కుళ్లిపోయి, ఎముకలు మాత్రమే మిగిలే స్థితికి వచ్చింది. బంధువులు ఎవరూ రాకపోవడంతో ఈ విషయాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆమెను పోలీసులు షీలా రెడ్డిగా గుర్తించారు. ఈ మేరకు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి.
ఆకలితో అలమటించి షీలా రెడ్డి నాలుగు, ఐదు నెలల క్రితం మరణించి ఉంటుదని పోలీసులు భావిస్తున్నారు. బెంగళూర్లోని ఇందిరానగర్ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. షీలా రెడ్డి ఒంటరిగానే ఉంటోందని, బంధువులు రాకపోవడంతో ఆమె తీవ్ర నిస్పృహకు గురై ఉంటుందని ఇరుగుపొరుగువారు అంటున్నారు.
ఆరు నెలల తర్వాత షీలా రెడ్డి సోదరుడు శంకర్ రెడ్డి ఇంటికి వచ్చాడు. కిటికీలోంచి చూసేసరికి అతనికి సోదరి శవం కనిపించింది. ఇంటిలో ఆహార పదార్థాలు ఏవీ కనిపించలేదని పోలీసులు చెప్పారు. కొద్ది నెలల క్రితం దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఇరుగుపొరుగువారు అంటున్నారు. కుక్క చచ్చిపోయి ఉంటుందని కొట్టిపారేశారని ఆరోపిస్తున్నారు.
షీలా రెడ్డి ఇంటికి ఎవరూ వచ్చేవారు కాదని, ఆమెకు ఆహారం ఇవ్వడానికి అప్పుడప్పుడు బంధువులు వచ్చేవారని చెబుతున్నారు. ఏళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులకు ఇక్కడ భారీగా భూములుండేవని అంటున్నారు.