ప్రజలపై ప్రభుత్వం రసాయన దాడి!: 1300మంది మృతి
డమాస్కస్: సిరియాలో అంతర్యుద్ధం పరాకాష్టకు చేరుకుంది. ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నేతృత్వంలోని సైన్యం బుధవారం రెచ్చిపోయింది. తిరుగుబాటుదారులపై సైన్యం తెగబడి ఏకంగా రసాయనిక ఆయుధాలను ప్రయోగించింది. బుధవారం డమాస్కస్లో సమీపంలోని ఫౌటా ప్రాంతంలో 1300 మందికిపైగా మృత్యువాత పడ్డారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. ఊపిరాడక ఇబ్బంది పడుతున్న చిన్నారులకు స్థానిక ఆసుపత్రిలో వైద్యం చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సంచలనం సృష్టించాయి.
అనేక మంది వీధుల్లోనే ఎక్కడికక్కడ పడిపోయిన దృశ్యాలు నివ్వెరపరిచాయి. తిరుగుబాటు ప్రాంతాల్లో జనంపై సిరియన్ సైన్యం రసాయనిక ఆయుధాలను ప్రయోగించిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. విష వాయువులు ప్రయోగించి వందలాది మందిని క్రూరంగా చంపినట్లు తిరుగుబాటుదారుల కూటమి ఎల్సీసీ పేర్కొంది. తూర్పు ఫౌటాలో బాంబు దాడులు కొనసాగుతున్నాయని పెద్దసంఖ్యలో ఆసుపత్రులకు చేరుతున్న బాధితులకు సరైన వైద్యం అందడం లేదని తెలిపింది. సిరియాలోని ప్రతిపక్షాలు కూడా రసాయనిక ఆయుధాలతో దాడి చేశారన్న అనుమానాన్ని వ్యక్తంచేశాయి.
దీంతో ప్రపంచవ్యాప్తంగా అలజడి రేగింది. మానవ హక్కుల సంఘాలు మండిపడ్డాయి. అగ్ర దేశాలన్నీ విస్మయం వ్యక్తం చేశాయి. దీనిపై వెంటనే సమగ్ర విచారణ జరపాలని అమెరికా, బ్రిటన్, యురోపియన్ యూనియన్, సౌదీ అరేబియా తదితర దేశాలు ఐక్యరాజ్యసమితిని కోరాయి. రసాయనిక ఆయుధాల వినియోగం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని సూచించాయి.
ఇక దేశంలో జరుగుతున్న మానవహననంపై తక్షణమే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి భేటీ జరపాలని సిరియన్ జాతీయ కూటమి డిమాండ్ చేసింది. పౌరులపై బాంబు దాడులను కూటమి నేత అహ్మద్ అల్ జర్బా ఖండించారు. అయితే ఈ ఆరోపణలను సిరియా సైన్యం తోసిపుచ్చింది. అవన్నీ అవాస్తవాలని పేర్కొంది. ఇప్పటికే సిరియాకు చేరుకున్న ఐక్యరాజ్యసమితి విచారణ కమిటీని తప్పుదోవ పట్టించేందుకే ఇలాంటి ఆరోపణలను తెరపైకి తెస్తున్నారని మండిపడింది.
ఎలాంటి రసాయనిక ఆయుధాలు వాడలేదని ప్రభుత్వ వార్తా సంస్థ సనా కూడా వివరణ ఇచ్చింది. కాగా, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అనధికారికంగా అత్యవసర సమావేశం నిర్వహించింది. సిరియాలో పరిస్థితిని సమీక్షించింది. రసాయనిక ఆయుధాలు వాడారన్న వార్తలతో షాక్కు గురైనట్లు సమితి ప్రధాన కార్యదర్శి బాన్కీమూన్ తెలిపారు. ఈ వ్యవహారంపై సమితి ప్రత్యేక కమిటీ సమగ్ర విచారణ జరుపుతుందని ఆయన ప్రతినిధి వెల్లడించారు.