జైలులో దీక్ష: వైయస్ జగన్కు మద్దతుగా మోపిదేవి
తాము దీక్ష చేపట్టే విషయంపై జగన్, మోపిదేవి తమ న్యాయవాదుల ద్వారా న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. దీక్షలకు అనుమతి కోసం వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వారి దీక్షలకు అధికారుల నుంచి అనుమతి లభించే అవకాశాలు లేవని అంటున్నారు. అయితే, దీక్షకు అనుమతి కోరుతూ తమకు ఏ విధమైన లేఖ అందలేదని జైలు అధికారులు చెబుతున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కొణతాల రామకృష్ణతో పాటు భూమా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాసు చంచల్గుడా జైలులో వైయస్ జగన్ను కలిశారు. జగన్ రేపటి నుంచి జైలులో దీక్ష చేపడుతారని కొణతాల రామకృష్ణ చెప్పారు. జైలు నిబంధనల ప్రకారమే జగన్ దీక్ష చేస్తారని ఆయన శనివారం మీడియాతో చెప్పారు.
రాష్ట్రాన్ని విభజిస్తే అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలని, ఆలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన సమస్యను మరింత జఠిలం చేసే విధంగా వ్యవహరిస్తున్న కేంద్రం వైఖరికి నిరసనగా జగన్ రేపటి నుంచి దీక్ష చేస్తారని ఆయన చెప్పారు.