తోలు మందం: చిరు, కావూరి, పురంధేశ్వరిలపై 'వీరం'గం
రాయలసీమ, ఆంధ్ర గడ్డపై కేంద్ర మంత్రులు పుట్టలేదా, ఈ ప్రాంతాల గాలి పీల్చలేదా అని ఆయన ప్రశ్నించారు. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల నీళ్లు తాగలేదా అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ రాజీనామా చేస్తే చేతులు కట్టుకుని కూర్చుకుంటారా అని ఆయన ప్రశ్నించారు.
వెంటనే రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్రలో జరుగుతున్న ప్రజా ఉద్యమాలను చూస్తే వారు కళ్లు తిరిగి పడిపోతారని ఆయన కడపలో వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులే రాష్ట్ర విభజనకు కారణమని ఆయన నిందించారు.
లాబీల్లో కూడా ఉండకూడదట..
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితికి రాజకీయ నాయకులే కారణమని సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కనుమూరి బాపిరాజు అన్నారు. అందరం సంతకాలు పెట్టడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన శనివారం ఢిల్లీలో మీడియాతో అన్నారు. ప్రస్తుతం అయోమయ పరిస్థితులు నెలకొని ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజకీయాలను పక్కన పెట్టి అందరం కలిసి ఏం చేయాలనే విషయంపై ఆలోచన చేయాలని ఆయన సీమాంధ్ర రాజకీయ నాయకులను కోరారు. రాష్ట్రం కలిసి ఉంటే ఎలా ఉండాలని, విభజిస్తే ఏం చేయాలనే విషయాలపై నిర్దిష్టంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సస్పెండ్ కావడంతో పార్లమెంటు లాబీల్లో కూడా ఉండకూడదని నోటీసులు ఇచ్చినట్లు కనుమూరి తెలిపారు.
కాగా, ఢిల్లీలో చిరంజీవి నివాసంలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కావూరి సాంబశివ రావు, జెడి శీలం, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, బాపిరాజు, సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, కెవిపి రామచందర్ రావు పాల్గొన్నారు.