అవనిగడ్డలో టిడిపి అభ్యర్థి అంబటి ప్రసాద్ విజయం
విజయవాడ: కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబటి శ్రీహరి ప్రసాద్ ఘన విజయం సాధించారు. శనివారంనాడు ఓట్ల లెక్కింపు జరిగింది. అంబటి శ్రీహరి ప్రసాద్ 61,644 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయనపై ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేశారు. వారిలో సైకం రాజశేఖర్కు 13,638 ఓట్లు రాగా, సుబ్రహ్మణ్యానికి 3,389 ఓట్లు వచ్చాయి.
అంబటి శ్రీహరి ప్రసాద్పై కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు తమ అభ్యర్థులను పోటీకి దింపలేదు. అంబటి శ్రీహరి ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని తెలుగుదేశం పార్టీ ప్రధాన పార్టీలను కోరింది. దీంతో ఆ పార్టీలు అభ్యర్థులను పెట్టలేదు. అయితే, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉండడంతో పోలింగ్ అనివార్యంగా మారింది.
తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య మరణించడంతో అవనిగడ్డకు ఉప ఎన్నిక జరిగింది. తెలుగుదేశం పార్టీ అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు అంబటి శ్రీహరి ప్రసాద్ను పోటీకి దింపింది. దీంతో మిగతా పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి.
అంబటి శ్రీహరి ప్రసాద్ విజయంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడిపై విశ్వాసంతో శ్రీహరి ప్రసాద్ను గెలిపించారని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.