రాష్ట్రమిచ్చాం, రెచ్చగొట్టకండి: టి నేతలకు ఆంటోని కమిటీ
తమపై సీమాంధ్ర నేతలు చేస్తున్న ఫిర్యాదులు సరైనవి కాదని వారు వివరించారు. సీమాంధ్రకు చెందిన టిడిపి ఎంపీలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని విమర్శించినా ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు పట్టించుకోలేదని, పైగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న వాళ్లను కలిసి సంఘీభావం ప్రకటించారని పొన్నం ఫిర్యాదు చేశారు. రెచ్చగొట్టే ప్రకటనలు చేసినా తాము సంయమనంతో ఉన్నామని అన్నారు.
విభజనపై తీసుకున్న నిర్ణయాన్ని త్వరగా అమలు చేయాలని, ప్రక్రియ అమలు అవుతుంటే పరిస్థితి సద్దుమణుగుతుందని వారు వివరించారు. వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి సీమాంధ్ర ప్రజలకు సమయం పడుతుందని, వారు దిగ్భ్రాంతిలో ఉన్నారని చెప్పారు. తాము వారి ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పిస్తామని, స్నేహహస్తం అందిస్తామని కూడా తాము భరోసా ఇచ్చామని, వారే తమను రెచ్చగొడుతున్నామని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. అయితే, సంయమనం పాటించాలని ఆంటోని కమిటీ వారికి సూచించింది.
సంప్రదింపులు జరిగాకనే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నామని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు ఏకపక్ష నిర్ణయం అనడం టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు ప్రచారం చేయడం సరికాదన్నారు. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపాకనే నిర్ణయం జరిగిందన్నారు.