మూడేళ్లుగా 14 మందిపై వార్డెన్ అత్యాచారం, అరెస్ట్
ఈటానగర్: ఓ హాస్టల్ వార్డెన్ గత కొన్ని ఏళ్లుగా పద్నాలుగు మంది మైనర్ బాలికల పైన అత్యాచారానికి పాల్పడిన సంఘటన అరుణాచల్ ప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని వెస్య్ సియాంగ్ జిల్లా లికాబాయిలోని ఓ ప్రయివేటు పాఠశాలలో వార్డెన్ ఈ ఘాతుకానికి పాల్పడుతున్నాడు.
ఈ విషయాన్ని కొద్ది రోజులుగా విద్యార్థులు బయటకు చెప్పేందుకు భయపడ్డారు. అయితే, బాధితుల్లో కొందరు దీనిని పోలీసులకు తెలియజేశారు. అత్యాచార బాధిత బాలికలలో నాలుగేళ్ల నుండి పదమూడేళ్ల వరకు ఉన్నారు.
విషయం తెలిసిన స్థానికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. వారు స్థానిక పోలీసు స్టేషన్ను ముట్టడించి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయం కొద్దిమంది విద్యార్థులు తమకు తెలిపారని పోలీసులు చెప్పారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిందితుడు, రాష్ట్రేతరుడైన విపిన్ను అదుపులోకి తీసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మరో ఇద్దరిని విచారించారు.
కేసు నమోదు చేసుకున్నామని, విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు. బాధిత బాలికలు గత మూడేళ్లుగా ఆ పాఠశాలకు వెళ్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని నిందితుడు విద్యార్థులను హెచ్చరించారని చెప్పారు.