సీమలో సమైక్యం: ఉట్టి కొట్టి నిరసన, నేతల నిలదీత
హైదరాబాద్: విభజనపై సిడబ్ల్యూసి నిర్ణయాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో విభజన ఉట్టి కొట్టి నిరసన తెలిపారు. ఉద్యమంలోనే పండుగలు, రోడ్డు పైన పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. తెలుగు ఇంట ఆడపడచులకు ఇష్టమైన పండుగ కృష్ణాష్టమి. ఈ నేపథ్యంలో రోడ్డు పైనే పండుగ జరుపుతున్నారు. విభజన ఉట్టిని కసిగా కొట్టి సంబరం చేసుకుంది. మరోవైపు నెల్లూరులో జాలర్లు పడవలకు సమైక్య జెండాలు కట్టుకొని సముద్రంలోకి వెళ్లి పిల్లాజెల్లతో బైఠాయించారు.
చిత్తూరు జిల్లాలో 48 గంటల బంద్లో తొలి రోజైన బుధవారం సకల వ్యాపార, జీవన రంగాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. బంద్కు మద్దతుగా శ్రీకాళహస్తిలో రైతులు ర్యాలీ జరిపారు. చంద్రగిరిలో జెఏసి రిలే దీక్షా శిబిరం వద్దకు వెళ్ళిన చిత్తూరు టిడిపి ఎంపి శివ ప్రసాద్, తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను ఉద్యమకారులు అడ్డుకొని వెనక్కి పంపారు. తాను రాజీనామా చేస్తే రాష్ట్ర విభజన ఆగేటట్టయితే పదిసార్లు రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని శివ ప్రసాద్ ప్రకటించారు.
పాలసముద్రం మండలం బలిజకండ్రిగ వద్ద ఎమ్మెల్యే కుతూహలమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. అనంతపురం జిల్లా హిందూపురంలో మంత్రి రఘువీరా రెడ్డి కనిపించడం లేదంటూ, ఆచూకీ తెలిపితే పారితోషకం ఇస్తామంటూ సమైక్యవాదులు ఆయన ఫొటో ఉన్న పోస్టర్లు అతికించడం, కరపత్రాలను పత్రికల్లో పెట్టి పంచడం చేశారు. లేపాక్షిలో రఘువీరాపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
గుంటూరు పట్టణంలో కెసిఆర్ ఫొటోతో ఏర్పాటు చేసిన ఉట్టిని కొట్టి సమైక్యవాదులు శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులకు రోడ్డుపైనే తరగతులు నిర్వహించారు. మంత్రి పసుపులేటి బాలరాజు కనిపించడం లేదని, ఆయన ఆచూకీ కనుగొని తెలపాలంటూ ఉద్యమకారులు విశాఖ జిల్లా పాడేరు ఎస్ఐ ప్రసాద్కు ఫిర్యాదు చేశారు.
విజయనగరం పట్టణంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మకు శవయాత్ర, కర్మకాండ, పిండ ప్రదానం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టిడిపి ఎమ్మెల్యే శివరామరాజు రిక్షా తొక్కు తూ, భిక్షాటన చేస్తూ సమైక్యవాదం వినిపించారు.