జగన్ పార్టీలో చేరిన తమ్మినేని, బాబుపై దాడి ఎద్దేవా
విభజనపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైఖరిని నిరసిస్తూ తమ్మినేని సీతారాం ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన బాబు పైన నిప్పులు చెరిగారు. బాబు చరిత్రహీనుడని, తెలుగు జాతి విచ్ఛిన్నానికి మద్దతిచ్చారని, ఆయనకు అధికార దాహం తప్ప.. రాష్ట్రాన్ని కాపాడాలనే ఆలోచన లేదని ఆరోపించారు. బాబు లక్ష పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మరన్నరు. ఎన్టీఆర్ తర్వాత జనం నుంచి వచ్చిన నాయకుడు దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి అని, జైలులో ఉండి కూడా జగన్ దీక్ష చేస్తున్నారని కితాబిచ్చారు.
గత కొంతకాలంగా తమ్మినేని టిడిపికి రాజీనామా చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. నాలుగు రోజుల క్రితం ఆయన రాజీనామా చేసినప్పుడే జగన్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని అందరూ భావించారు. ఇప్పుడు విజయమ్మ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు.
ఉత్తరాల బాబు: దాడి ఎద్దేవా
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉత్తరాల బాబు అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత దాడి వీరభద్ర రావు వేరుగా ఎద్దేవా చేశారు. విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను టిడిపి వెనక్కి తీసుకోవాలన్నారు. ఆ తర్వాతే బాబు ఆత్మగౌరవ యాత్ర చేపట్టాలన్నారు.