జైల్లో దీక్ష: మరింత క్షీణించిన జగన్ ఆరోగ్యం
ఆహారం తీసుకోకుంటే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని వైద్యులు చెప్పారు. బిపి కూడా పడిపోయింది. వైయస్ జగన్ ఆరోగ్యంపై గంట గంటకు జైళ్ల డిజిపికి చంచల్గుడా జైలు అధికారులు నివేదికలు పంపిస్తున్నారు. జగన్ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర హోం శాఖ అధికారులకు జైలు అధికారులు నివేదికను పంపించారు.
జగన్ రక్తంలో గ్లూకోజ్ కూడా పడిపోయింది. దీక్ష విరమించాలని జైలు అధికారులు సూచిస్తున్నప్పటికీ జగన్ వినడం లేదు. ఆయనకు బలవంతంగా ఆహారం అందించడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం కనిపించలేదు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తూ చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జైలులోనే ఆయనకు తగిన చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
జగన్ మద్దతుదారులు గురువారంనాడు జైలు బయట ప్రదర్శన నిర్వహించారు. ఆయనకు మద్దతు తెలపడానికి వస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యకర్తలను, మద్దతుదారులను పోలీసులు ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకుని వెనక్కి పంపిస్తున్నారు. కాగా, సీమాంధ్ర న్యాయవాదులు గురువారంనాడు జైలు వద్దకు వచ్చారు. ప్రతి రెండు గంటలకు ఒకసారి జగన్ ఆరోగ్యంపై బులిటెన్ విడుదల చేయాలని వారు జైలు అధికారులను కోరారు. ఈ మేరకు వారు జైలు అధికారులకు వినతిపత్రం సమర్పించారు.