చంపలేదు, అదే ఊరట: యాసిన్ భత్కల్ ఫ్యామిలీ
యాసిన్ భత్కల్ను బూటకపు ఎన్కౌంటర్లో చంపుతారనే తమ భయాలు తొలగిపోయాయని అతని తండ్రి యాకూబ్ సిద్దిబాపా కర్ణాటకలోని భత్కల్ నుంచి విడుదల చేసిన ఓ ప్రకటనలో అన్నారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఏదైనా నేరం చేసినట్లు రుజువైతే అతనికి శిక్ష వేయవచ్చునని, అభియోగాలు రుజువు అయ్యే వరకు ఎవరైనా నిర్దోషులేనని ఆయన అన్నాడు.
భత్కల్ 2007 జనవరిలో దుబాయ్లో తప్పిపోయాడని, తమకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు భత్కల్ పూణేలో కాలు పెట్టలేదని కుటుంబ సభ్యులు అన్నారు. పూణేలోని జర్మన్ బేకరీ పేలుళ్ల కేసులో యాసిన్ భత్కల్ ప్రధాన నిందితుడు. ఈ సంఘటనలో 17 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు.
మొహమ్మద్ అహ్మద్ జరార్ సిద్దిబాపా 1983లో జన్మించాడని, ఒకటి నుంచి పదో తరగతి వరకు భత్కల్లో చదువుకున్నాడని, దాంతో అతనికి భత్కల్ అనే పేరు వచ్చిందని కుటుంబ సభ్యులు చెప్పారు. పదో తరగతి ఉత్తీర్ణుడు కాలేదని, 2005 నవంబర్లో దుబాయ్ వెళ్లాడని, 2007 నుంచి అతని జాడ తెలియడం లేదని కుటుంబ సభ్యులు చెప్పారు. దుబాయ్ నిఘా సంస్థలు, కుటుంబ సభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది.