జంట పేలుళ్లు: భత్కల్ అరెస్ట్, విచారిస్తామన్న అనురాగ్
ఇండో-నేపాల్ సరిహద్దుల్లో భత్కల్ ఉన్నాడనే విషయాన్ని తెలుసుకున్న జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) అదుపులోకి తీసుకుంది. దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్లతో పాటు భత్కల్ దేశంలోని పలు నగరాలలో పేలుళ్లలో భత్కల్ హస్తం ఉంది. బెంగళూరు, పుణే, ఢిల్లీ, నాగపూర్ తదితర నగరాల్లో పేలుళ్లలో ఇతని పాత్ర ఉంది. ఇతని పైన రూ.20 లక్షల రివార్డ్ ఉంది.
యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్లు సోదరులు. దిల్సుఖ్ నగర్ పేలుళ్లు జరిగనప్పటి నుండి యాసిన్ భత్కల్ కోసం ఎన్ఐఏ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. సోదరుడు రియాజ్ పైన గతంలో బెంగళూరులో జరిగిన వరుస బాంబు పేలుళ్ల అనంతరం సెంట్రల్ క్రైం బ్రాంచ్ (సిసిబి) పోలీసులు 2012 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకల్లో దర్యాప్తు జరిపి 25 మందిపై కేసులు నమోదు చేశారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సహా పలువురు ప్రముఖుల హత్యకు కుట్ర పన్నారు. పలువురు కార్పోరేటర్లను కూడా టార్గెట్గా పెట్టుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాగా, ఫిబ్రవరి 21వ తేదిన హైదరాబాదులోని దిల్సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగాయి.
భత్కల్ను ప్రశ్నిస్తాం: హైదరాబాద్ కమిషనర్
అరెస్టైన యాసిన్ భత్కల్ను, మరో ఉగ్రవాదిని ప్రశ్నిస్తామని హైబరాబాద్ పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ గురువారం హైదరాబాదులో చెప్పారు. ఎన్ఐఏ అధికారులతో కలిసి దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసును విచారిస్తామన్నారు. అవరమైతే పిటి వారెంట్తో వారిని హైదరాబాద్ తీసుకు వస్తామని, పేలుళ్ల వెనుక ఎవరున్నారో తెలుసుకుంటామన్నారు. రాష్ట్ర పోలీసు బృందాన్ని బీహార్కు పంపిస్తామని చెప్పారు. కాగా, భత్కల్ ప్రస్తుతం బీహార్ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఢిల్లీలో చెప్పారు.