సమైక్య లేఖ ఇచ్చి బాబు యాత్ర చేయాలి: అశోక్బాబు
హైదరాబాద్: సమైక్యాంధ్రకు అనుకూలంగా లేఖ ఇచ్చిన తర్వాతనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీమాంధ్రలో పర్యటించాలని ఎపిఎన్జీల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు అన్నారు. తెలంగాణలో పర్యటించడానికి ముందు తెలంగాణ కోసం కేంద్రానికి లేఖ ఇచ్చినట్లే సీమాంధ్రలో పర్యటించడానికి ముందు సమైక్యాంధ్రకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇవ్వాలని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
దేని కోసం చంద్రబాబు సీమాంధ్రలో బస్సు యాత్ర చేస్తున్నారో స్పష్టం చేయాలని ఆయన అన్నారు. దానిపై చంద్రబాబుకే స్పష్టత లేదని ఆయన అన్నారు. చంద్రబాబు ఏం చెబుతారో ప్రజలకు తెలియడం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో మాదిరిగా తిట్టడం, కొట్టడం చేయరు గానీ ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తారని ఆయన అన్నారు.
ప్రస్తుత పరిస్థితిలో చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లడం మంచిది కాదని ఆయన అన్నారు. సమైక్యం కోసం నిలబడతారో, తెలంగాణకు మద్దతు ఇస్తారో చంద్రబాబు స్పష్టం చేయాలని ఆయన అన్నారు. కాగా, ఢిల్లీలో సీమాంధ్ర ఉద్యోగ ప్రతినిధులు శుక్రవారం బిజెపి అగ్రనేతలు ఎల్కె అద్వానీ, సుష్మా స్వరాజ్లను కలిసి పార్లమెంటులో బిల్లు పెడితే వీగిపోయేలా చూడాలని కోరారు.
ఇదిలావుంటే, తెలంగాణను అడ్డుకుంటున్న సీమాంధ్ర నేతల మాటలను నమ్మవద్దని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో రెండు ప్రాంతాల మధ్య పెద్ద చీలిక ఏర్పడిందని ఆయన అన్నారు. అపోహల ఆధారంగా కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు రెచ్చగొడుతున్నారని ఆయన విమర్శించారు
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు అవకాశాదాన్ని తెలియజేస్తున్నాయని ఆయన అన్నారు. సమస్యలు వస్తాయంటున్న ముఖ్యమంత్రి ఆ సమస్యలేమిటో చెప్పడం లేదని ఆయన అన్నారు. వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.