చికిత్సకు జగన్ నో: విజయమ్మ పరామర్శ, వివేకాకు నో
అనంతరం ఉస్మానియా ఆర్ఎంవో డాక్టర్ రఫీ శుక్రవారం ఉదయం మాట్లాడారు. జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించామన్నారు. వైద్యానికి అతను సహకరించడం లేదన్నారు. మరోవైపు ఆసుపత్రిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ జగన్ను పరామర్శించారు.
మరోవైపు, జగన్ షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి. షుగర్ లెవల్స్ 60గా ఉంది. బిపి 120/80 ఉంది. వైద్యులు జగన్ను దీక్ష ఉపసంహరించుకోమని మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేసినా ఆయన ససేమీరా అంటున్నారు. గ్లూకోజ్ నీళ్లను కూడా నిరాకరిస్తున్నారు. కాలేయ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎనిమిది మంది వైద్యుల పర్యవేక్షణలో జగన్ ఉన్నారు.
ఉస్మానియా వద్ద భారీ భద్రత
జగన్కు చికిత్స నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రతను పెంచారు.
వైయస్ వివేకాకు, తమ్మినేనికి లోపలకు నో
ఉస్మానియా ఆసుపత్రికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వైయస్ వివేకానంద రెడ్డి, తమ్మినేని సీతారాంలు వచ్చారు. వారిని పోలీసులు లోపలకు అనుమతించలేదు. జగన్ను చూసేందుకు తమకు అనుమతించక పోవడం దారుణమని వివేకా ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు జగన్ దీక్ష భగ్నం నేపథ్యంలో అనంతపురంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జైల్ భరోకు పిలుపునిచ్చింది.