జగన్ను తరలించాలని వైద్యుల లేఖ: భారతి భేటీకి నో
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉస్మానియా జనరల్ ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించాలని ఆస్పత్రి వైద్యులు కోరారు. ఈ మేరకు ఉస్మానియా వైద్యుల కమిటీ జైళ్ల శాఖకు ఓ లేఖ రాసింది. జగన్కు వైద్యం ఆందించడానికి తమ వద్ద అత్యాధునిక సదుపాయాలు లేవని, అందువల్ల నిమ్స్ వంటి వేరే ఆస్పత్రికి తరలించాలని వారన్నారు.
దానికితోడు, ప్రతి రోజూ ఉస్మానియాకు అనేక మంది రోగులు వస్తారని, జగన్ను ఆస్పత్రిలో ఉంచడం వల్ల వైద్య సేవలకు అంతరాయం కలుగుతుందని వారన్నారు. వైయస్ జగన్ ఆరోగ్యం మరింత క్షీణించిందని, పరిస్థితి విషమిస్తే బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కిస్తామని వైద్యులు చెప్పారు.
ఉస్మానియా ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న వైయస్ జగన్ను కలవడానికి ఆయన సతీమణి వైయస్ భారతి చేసిన ప్రయత్నాలు పోలీసులు అడ్డుకున్నారు. వైయస్ జగన్ను కలవడానికి అనుమతి ఇవ్వాలని వైయస్ భారతి పోలీసులను కోరారు. అయితే, పోలీసులు అందుకు అనుమతించలేదు. దాంతో ఆమె వెనుదిరిగి వెళ్లిపోయారు.
కాగా, ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వద్ద సహాయంగా ఉండేందుకు తమకు అనుమతించాలని కోరుతూ ఆయన తల్లి వైయస్ విజయమ్మ, భార్య వైయస్ భారతి దాఖలు చేసుకున్న మెమోను సిబిఐ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆస్పత్రిలో ఒక్కడే ఉన్నందున కుటుంబ సభ్యులమైన తమను జగన్తో ఉండేందుకు అనుమతించాలని కోరుతూ వారిద్దరు శుక్రవారం సిబిఐ ప్రత్యేక కోర్టులో మెమో దాఖలు చేసుకున్నారు. జగన్ వద్ద ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని భారతి చేసిన వ్యక్తిగత విజ్ఝప్తిపై న్యాయమూర్తి రేపు శనివారం నిర్ణయం తీసుకోనున్నారు.