విజయమ్మకు టిడిపి నేతల లేఖ, కోర్టులో జగన్ మెమో
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మకు తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసన సభ్యులు శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. అధికార పక్షాన్ని వదిలి ప్రతిపక్షం పైన విమర్శలు చేయడం కాంగ్రెసు పార్టీకి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కుదిరిన లాలూచికి నిదర్శనమన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుకు రాకముందే దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణ కోసం నలభై మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చేతికి ఆర్టికల 3 అనే కత్తిని ఇచ్చి రాష్ట్రాన్ని చీల్చమన్నది మీరు కాదా అని ప్రశ్నించారు.
రహస్య అజెండా లేకపోతే యూపిఏకు మద్దతు ఇవ్వమని ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ కోసం రాష్ట్రపతితో రాయబారం నడుపుతున్నది నిజం కాదా అని, షర్మిల పాదయాత్రలో, పరకాల ఎన్నికల్లో తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదా చెప్పాలని ప్రశ్నించారు.
జగన్ లాయర్ మెమో దాఖలు
ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్న జగన్ వద్ద వారి కుటుంబ సభ్యులు ఉండేందుకు అనుమతివ్వాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాది శుక్రవారం సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు.