జగన్ దీక్ష భగ్నం: ఉస్మానియాకు తరలింపు, ఉద్రిక్తం
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా హైదరాబాదులోని చంచల్గుడా జైలులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను అధికారులు గురువారం అర్థరాత్రి భగ్నం చేశారు. ఆయన ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజుల పాటు ఆయన జైలుల ఆహారం ముట్టకుండా దీక్ష కొనసాగించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆస్పత్రిక తరలించారు.
గురువారం రాత్రి 11 గంటల 45 నిమిషాల సమయంలో సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ భద్రత మధ్య బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వీల్ చెయిర్ ఏర్పాటు చేయగా ఆయన తిరస్కరించి వాహనం దిగి నడుచుకుంటూ ఆస్పత్రి లోపలికి వెళ్లారు. క్యాజువాలిటీలో బిపి, షుగర్ స్థాయిలను పరీక్షించి అత్యవసర వార్డులోకి తరలించారు.
జగన్ ఆరోగ్యం క్షీణించిందని జైలు వైద్యులు చెప్పారని, దీంతో ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఆస్పత్రికి తరలించామని జైలు సూపరింటిండెంే సైదయ్య తెలిపారు. జగన్ దీక్షను భగ్నం చేసేందుకు గురువారం ఉదయం నుంచే జైలు అధికారులు సిద్ధమయ్యారు. జైళ్ల శాఖ డిజి సాంబశివ రావు సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు జైలు సూపరింటిండెంట్ సైదయ్య, ఐజి సునీల్ కుమార్లతో మాట్లాడుతూ వచ్చారు.
ఆదివారం నుంచి వైయస్ జగన్ దీక్షకు కూర్చున్నారు. అయితే, గురువారంనాడు మాత్రమే జైలు అధికారులు జగన్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరించలేదు. చివరకు రాత్రి పూట దీక్షను భగ్నం చేశారు. జగన్ను గురువారం ఆస్పత్రికి తరలిస్తారని ఉదయం నుంచి వస్తున్న వార్తల నేపథ్యంలో ఉస్మానియా ఆస్పత్రిని కేంద్ర, స్థానిక పోలీసు బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎవరూ లోనికి వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మీడియా ప్రతినిధులనూ గుర్తింపు కార్డులు చూసి మాత్రమే లోనికి అనుమతించారు. జగన్ను తరలించడానికి రెండు గంటల ముందే వైద్యాధికారులు ప్రత్యేక ఎసీ గదిని సిద్ధం చేశారు. వైద్య నిపుణులను, చికిత్సకు అవససమైన సెలెన్లను సిద్ధం చేశారు.