భత్కల్ మాస్టర్ మైండ్: 4 రోజుల క్రితమే అరెస్ట్ చేసినా..
అతని తండ్రి జరార్ సిద్దిబప్ప దుబాయ్లో వస్త్ర వ్యాపారి. రియాజ్, ఇక్బాల్ భత్కల్ సోదరులు. యాసిన్ 2004 నుంచే నేర ప్రపంచంతో సంబంధాలు పెంచుకున్నాడు. తర్వాత నిషేధిత సిమీ సంస్థలో చేరాడు. 2008లో ఇండియన్ ముజాహిదీన్ను స్థాపించాడు. ఈ క్రమంలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తాయిబావద్ద శిక్షణ పొందాడు. భత్కల్ ఇంజనీరింగ్ చదివినట్లు చెబుతారు. అయితే అతను పదో తరగతి ఫెయిలైనట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.
కొంతకాలం తండ్రికి సాయంగా దుబాయ్లో ఉండి, ఆ తర్వాత మాయమై ఉగ్రవాదిగా తేలాడు. ఐఎం తరఫున రూ.14లక్షల విరాళం సేకరించి, ఓ నిర్మాణ సంస్థలో పెట్టుబడి పెట్టాడు. ఉగ్రవాద సంస్థ నుంచి వచ్చే నిధులన్నీ ఆ సంస్థ ద్వారా వచ్చినట్టు చెప్పేవాడు. బాంబుల తయారీలో ప్రావీణ్యం సంపాదించాడు. ఐఎంలో చేరే యువతకు శిక్షణ ఇచ్చాడు. దొంగనోట్ల చలామణితో ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చేవాడు.
సోదరుడు రియాజ్తో కలిసి ఐఎం కార్యకలాపాలను విస్తృతం చేశాడు. సంస్థలో అన్నదమ్ములిద్దరిదీ కీలకపాత్రే అయినప్పటికీ వారి వ్యవహార శైలి భిన్నంగా ఉండేది. రియాజ్ చాలా దూకుడుగా ఉంటే యాసిన్ నెమ్మదస్తుడు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటాడు. మారణహోమాలు సృష్టించి బాధ్యులం మేమేనంటూ ఈ-మెయిల్ పంపించే తమ ధోరణికి స్వస్తి చెప్పాడు. అలా సవాల్ విసిరి గూఢచారి సంస్థలకు ఆధారాలు ఇవ్వడం వల్ల సంస్థకు గతంలో తీవ్రనష్టం వాటిల్లిందని భత్కల్ భావించాడు.
ఐఎంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నా తన పేరు బయటపడకుండా యాసిన్ జాగ్రత్త పడేవాడు. ఢిల్లీ పేలుళ్ల సందర్భంగా అరెస్టు చేసిన మహమ్మద్ సయీఫ్, ఇస్మాయిల్ చౌదరిల ద్వారా యాసిన్ భత్కల్ పేరు మొదటగా తెలిసిందని ఇంటిలిజెన్స్ వర్గాలు చెప్పాయి. బాంబు ఎలా తయారు చేయాలో తమకు యాసిన్ నేర్పాడని విచారణలో ఉగ్రవాదులు వెల్లడించారు. ఐఎం సంస్థ స్థావరాలను మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటకల నుంచి తరలించి, బీహార్లో కొత్త స్థావరాన్ని ఏర్పాటు చేయడంలోనూ యాసిన్ కీలకపాత్ర పోషించాడు.
ఉగ్రవాద వ్యూహాలు రచించడంలో సిద్ధహస్తుడైన ఫాసిష్ మహమ్మద్తో ఏర్పడిన పరిచయం వల్ల భత్కల్ బీహార్ చేరాడు. వీరిద్దరూ కలిసి మొదటిసారిగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం పేలుళ్లు సృష్టించడంతో పాటు జామా మసీదు వద్ద కాల్పులకు తెగబడ్డారు. అక్కడి నుంచి దేశంలో ఎన్నో బాంబు పేలుళ్లకు యాసిన్ భత్కల్ వ్యూహాలు రూపొందించాడు. నెట్వర్క్ను భారీగా పెంచుకుని దేశంలో ఎక్కడైనా పేలుళ్లు సృష్టించగలిగే స్థాయికి ఎదిగాడు. ఇందులో పాక్ ఉగ్రవాదులు కూడా తోడ్పడ్డారు. ఐఎం కార్యకలాపాల వేదికను సౌదీ అరేబియాకు మార్చడంలో కూడా భత్కల్ కీలకపాత్ర పోషించాడు.
ప్రస్తుతం పండుగల సీజన్ కావడంతో కోల్కాతా, పాట్నా తదితర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి బాంబులు పేల్చేందుకు భత్కల్ కుట్రపన్నుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దసరా నేపథ్యంలో కోల్కాతాలో దేవీ నవరాత్రులు, ముంబై, హైదరాబాద్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతాయి. వీటిని టార్గెట్ చేసుకుని ఏదో ఒక చోట దాడిచేసే వ్యూహంతో ఐఎం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. భత్కల్ని కస్టడీకి తీసుకుని వివరాలు రాబట్టడానికి సిద్ధమవుతున్నారు.
మరోవైపు భత్కల్ను విచారిస్తామని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపిన విషయం తెలిసిందే. అతనిని నాలుగు రోజుల క్రితమే అరెస్టు చేసినప్పటికీ మహారాష్ట్ర, కర్నాటక పోలీసుల నుండి అతనే యాసిన్ అని నిర్ధారణ చేసుకున్న తర్వాత గురువారం మీడియాకు చెప్పినట్లుగా తెలుస్తోంది.