యాసిన్ భత్కల్ ఎలా తప్పించుకుంటూ వచ్చాడు?
న్యూఢిల్లీ: దేశంలోనే ఉంటూ, దేశంలో పలు చోట్ల దాడులకు కుట్ర చేస్తూ వస్తున్న ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ భారత సంస్థల నుంచి ఎలా తప్పించుకుంటూ వచ్చాడనేది ఆసక్తికరంగా మారింది. టాప్ టెర్రరిస్టులు దాదాపు అందరూ తమ పేర్లు ప్రచారంలోకి వచ్చిన తర్వాత దేశం విడిచి వెళ్లిపోతూ వచ్చారు.
బడా ఉగ్రవాదులంతా పాకిస్తాన్లోనో, పశ్చిమ ఆసియాలోనో తల దాచుకుంటున్నారు. అయితే, వారికి భిన్నంగా గత ఐదేళ్లుగా యాసిన్ భత్కల్ దేశంలోనే ఉంటూ పేలుళ్లుకు పాల్పడుతూ భారత సంస్థల నుంచి తప్పించుకుంటూ వస్తున్నాడు. ఎట్టకేలకు బుధవారంనాడు చిక్కాడు.
ఇంజనీర్గా చెప్పుకుంటూ వచ్చే యాసిన్ భత్కల్ ఫోన్లకు దూరంగా ఉంటూ వచ్చాడు. అత్యధునాతన మార్గాలను మాత్రమే సమాచార వినిమయానికి వాడేవాడు. అతని కోసం గాలిస్తూ వచ్చిన భద్రతాబలగాలు అతను ఫోన్లు చేయకపోవడాన్ని గమనించినట్లు చెబుతున్నారు. ఎక్కువగా పబ్లిక్ బూత్లను వాడేవాడని చెబుతున్నారు. అత్యంత అవసరమైతే నకిలీ గుర్తింపులతో సెల్ఫోన్లను తీసుకునేవాడని చెబుతున్నారు.
చాట్ సర్వీసుల ద్వారానే అతను సమాచారాన్ని చేరవేయడానికి, సమాచారం తీసుకోవడానికి వాడుతూ వచ్చాడని చెబుతున్నారు. నింబజ్, యాహూ వ్యవస్థలను వాడేవాడని సమాచారం. అది కూడా ఆపరేషన్ ప్రారంభించి, దాన్ని పూర్తి చేసేంత వరకు వాడేాడి చెబుతున్నారు. అతను వ్యక్తులను స్వయంగా కలవడానికే ప్రాధాన్యం ఇచ్చేవాడని, కోర్ గ్రూపుతో కలిసి ఉండేవాడని, వ్యక్తిగతంగానే ప్రణాళికలపై చర్చలు జరిపేవాడని, స్వయంగా బాంబులను అమర్చాడని చెబుతున్నారు.