యాసిన్: రెండేళ్ల క్రితం చెన్నైలో తప్పించుకున్నాడు
చెన్నై: భారత్, నేపాల్ సరిహద్దుల్లో అరెస్టయిన ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ చెన్నైలో రెండేళ్ల క్రితం పోలీసుల పొరపాటు వల్ల తప్పించుకున్నాడు. రెండేళ్ల క్రితం 2011 నవంబర్లో యాసిన్ భత్కల్ చెన్నైలోని సెలయూర్లో గల పిలాయర్ కోయిల్ స్ట్రీట్లో తన బంధువు ఇర్షాద్ ఖాన్ నివాసంలో తల దాచుకున్నాడు.
ఇండియన్ ముజాహిదీన్కు చెందిన రియాజ్ భత్కల్, సోదరుడు ఇక్బాల్తో పాకిస్తాన్లోని కరాచీలో ఉన్న యాసిన్ భత్కల్ చెన్నైలో దిగినట్లు నిఘా సంస్థ ఢిల్లీ పోలీసులకు అప్పుడు ఉప్పు అందించింది. నవంబర్ 27వ తేదీన నిఘా సంస్థ విషయాన్ని ఢిల్లీ పోలీసులకు చెప్పినట్లు, అతన్ని పట్టుకోవడానికి సాయం కావాలని ఢిల్లీ పోలీసులు చెన్నై పోలీసులను అడిగినట్లు వార్తలు వచ్చాయి. దాంతో చెన్నై పోలీసులు యూనిఫామ్లో యాసిన్ భత్కల్ తలదాచుకున్న ఇంటిని చుట్టిముట్టారు.
మూడు రోజులుగా చెన్నైలో ఉన్న భత్కల్ మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఆ ప్రాంతాన్ని పోలీసులు చుట్టుముట్టిన విషయాన్ని గుర్తించాడు. ఇంటిపై దాడి చేసేలోగా అతను అక్కడి నుంచి అటే పారిపోయాడు. పోలీసులను చూసి భత్కల్ పారిపోయినట్లు పోలీసులకు చిక్కిన ఇర్షాద్ ఖాన్ చెప్పాడని సమాచారం.
ఢిల్లీ పోలీసులు ఇర్షాద్ ఖాన్ను, అతని అనుచరుడు అబ్దుల్ రెహ్మాన్ను అరెస్టు చేశారు పోలీసులు ఉగ్రవాద సంబంధాలకు చెందిన రాతపూర్వకమైన పత్రాలను, పోస్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయుధాలు గానీ పేలుడు పదార్థాలు గానీ వారికి లభించలేదు. భత్కల్ తప్పించుకోవడానికి చెన్నై పోలీసులే కారణమని ఢిల్లీ పోలీసు అధికారులు ఆ తర్వాత నిందించారు.