భార్యకు డబ్బు పంపి పట్టుబడిన యాసిన్ భత్కల్
న్యూఢిల్లీ: ఈద్కు ముందు భార్యకు వేయి డాలర్లు పంపించిన సంఘటనతో ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది యాసిన్ భత్కల్ స్థావరం బయటపడినట్లు చెబుతున్నారు. ఈ మేరకు శుక్రవారం జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. భారత నిఘా సంస్థలు ఢిల్లీలోని యాసన్ భత్కల్ భార్యపై, అతని అనునచరులుగా భావిస్తున్నవారిపై నిఘా పెట్టాయని అంటున్నారు.
భత్కల్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్న ఇన్ఫార్మర్ వ్యవస్థ ద్వారా నిఘా పెట్టారు. కుటుంబం ఫోన్లను కూడా ట్యాప్ చేశారని సమాచారం. తన భార్యకు తాను చేసిన ఫోన్ల వల్లనే పట్టుబడినట్లు యాసిన్ భత్కల్ విచారణాధికారులతో అన్నట్లు సమాచారం.
ఈ నెల 9వ తేదీ ఈద్కు ముందు యాసిన్ భత్కల్ రెండు సార్లు తన భార్యకు పోన్ చేసినట్లు చెబుతున్నారు. ఆ తర్వాత హవాలా మార్గంలో తన భార్యకు డబ్బులు, దుస్తులు పంపించాడని అంటున్నారు. అయితే, అదే సమయంలో నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని ఓ మారుమూల గ్రామంలో యాసిన్ తన ఇండియన్ ముజాహిదీన్ అనుచరులతో ఉన్నట్లు బీహార్లోని నిఘా సంస్థ అధికారులు చెప్పినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
2011 నుంచి యాసిన్ భత్కల్ ఉంటున్న ప్రదేశంలో ఇన్ఫార్మర్లు రెక్కీ కూడా నిర్వహించినట్లు చెబుతున్నారు. స్థానికులు మాత్రం యాసిన్ భత్కల్ను యునానీ వైద్యుడిగా భావిస్తూ వచ్చినట్లు చెబుతున్నారు. ఆ వేషంలోనే అతను భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు నడిపినట్లు కూడా భావిస్తున్నారు.
హద్దీ యాసిన్ భత్కల్తో పాటు ఫిబ్రవరిలో కలిశాడని చెబుతన్నారు. యాసిన్ భత్కల్తో పాటు హద్దీ కూడా అరెస్టయిన విషయం తెలిసిందే. యాసిన్ను గుర్తించినప్పటికీ సమయం కోసం భారత నిఘా సంస్థలు నిరీక్షించాయని అంటున్నారు. చివరికి బుధవారం రాగ్జౌల్ వద్ద సరిహద్దు దాటిన యాసిన్ను, అసదుల్లాను బీహార్ పోలీసులు అరెస్టు చేశారు.