కిరణ్ వ్యాఖ్యలు, యాక్షన్ అధిష్టానం చూస్తోంది: డిఎస్
హైదరాబాద్లో ఉన్నవారంతా తెలంగాణావారేనని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ శనివారం అన్నారు. తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధి వంటి పట్టుదల గలిగిన నాయకులు తక్కువ మంది ఉంటారని వ్యాఖ్యానించారు. తెలంగాణ సాధనలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని, అయినా వాటిని అధిగమించి తెలంగాణాను సాధించుకుంటామని ఆయన చెప్పారు.
చిరకాలస్వప్నమైన తెలంగాణ సాకారం కాబోతుందని ఇలాంటి సమయంలో మనమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. హైదరాబాదుకు అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకునే గొప్ప మనసుందన్నారు. తమ దృష్టిలో సెటిలర్లు అనే పదం లేదని, ఇక్కడున్న వారంతా హైదరాబాదీలేనని, తెలంగాణవాసులేనని చెప్పారు.
తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, సెప్టెంబర్ 12 వ తేదీన తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారని కేంద్ర మంత్రి బలరాం నాయక్ వెల్లడించారు. తెలంగాణ అంశంపై కేంద్రం ఒక నిర్ణయం తీసేసుకున్న తర్వాత ఇక వెనక్కు తిరిగేది ఉండదని ఆయన చెప్పారు. హైదరాబాద్లో నివసిస్తున్న సీమాంధ్రులకు తామే రక్షణ కల్పిస్తామని, ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. సీమాంధ్ర ప్రాంతవాసులకు న్యాయం చేయడంపై చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.