షర్మిల యాత్ర ఖరారు: సమైక్యవాదులమని విజయమ్మ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, కడప పార్లమెంటు సభ్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల సెప్టెంబర్ 2వ తేది నుండి చేపట్టబోయే బస్సు యాత్రకు సమైక్య శంఖారావం అని పేరు పెట్టారు. షర్మిల బస్సు యాత్ర సోమవారం కడప జిల్లా ఇడుపులపాయ నుండి ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో విజయమ్మ ఆదివారం ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఓట్లు, సీట్లు ప్రాతిపదికన విభజన నిర్ణయం జరిగిందని ఆమె తన లేఖలో ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యవాద పార్టీ అని పేర్కొన్నారు. సమైక్యాంధ్రకు సిపిఎం, మజ్లిస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కట్టుబడి ఉన్నాయన్నారు.
కాంగ్రెసు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, సిపిఐలు విభజనవాద పార్టీలు అని నిందించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని సమైక్యం వైపు రమ్మన్నా రాలేదని, విభజనను అడ్డుకోకుంటే ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతారన్నారు. అడ్డగోలుగా విభజన నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు.
సమైక్యం కోసం షర్మిల యాత్ర మరో ముందడుగు అన్నారు. వైయస్ జగన్ ఎప్పుడు ప్రజల పక్షాన్నే నిలిచారన్నారు. జగన్ రాష్ట్రాన్ని ప్రాణం కంటే మిన్నగా భావించారన్నారు. జగన్ నాయకత్వంలో ఎపి అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి వారసుడిగా జగన్ నీతి, నిజాయితీ గల రాజకీయం చేశారన్నారు. తాము ప్రధానికి లేఖ ఇచ్చినట్లుగా సమైక్యంకు కట్టుబడి ఉన్నామన్నారు.