శిల్ప ఔట్, కూన ఇన్: కేంద్రమంత్రుల్లో భిన్నాభిప్రాయం
కూన శ్రీశైలం గౌడ్ ఇన్
హైదరాబాదు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మంగళవారం కాంగ్రెసు పార్టీలో చేరారు. ఆయన ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెసు తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు అన్నారు. ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమన్నారు.
అన్ని పార్టీలు ఇచ్చాకే: జగ్గారెడ్డి
అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చాకే కాంగ్రెసు పార్టీ నిర్ణయం తీసుకుందని ప్రభుతవ చీప్ విప్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అన్నారు. టిడిపి ఎంపీలు సభకు ఇందిరా గాంధీ మాస్కులతో వచ్చి నిరసన తెలపడం సరికాదన్నారు.
రాజీనామాలు ఆమోదించండి: స్పీకర్కు సీమాంధ్ర కాంగ్
కాంగ్రెసు పార్టీ ఎంపీల పైన వేసిన సస్పెన్షన్ను ఎత్తివేయాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు స్పీకర్ మీరా కుమార్ను కోరారు. తమ రాజీనామాలు ఆమోదించాలని లేదంటే తమపై సస్పెన్షన్ ఎత్తివేయాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
కాగా, రాజీనామాలపై కేంద్రమంత్రుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విభజన నిర్ణయాన్ని నిరసిస్తూ కేంద్రమంత్రులు పలువురు రాజీనామాకు సిద్ధం అని చెప్పగా, మరికొందరు మాత్రం వెనక్కి తగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో వారు ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేను, రాత్రి ఎనిమిది గంటలకు ఆంటోని కమిటీని కలువనున్నారు. విభజన వద్దని వారు కోరనున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆంటోనీ కమిటీతో భేటీ అవుతారు.