మళ్లీ అఖిలపక్షం పెడితే సమైక్య లేఖ ఇస్తాం: జగన్ పార్టీ
హైదరాబాద్: తమ రాజీనామాలు ఆమోదించాలని సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కోరతామని తెలిపారు. రాష్ట్ర విభజనపై మరోమారు అఖిలపక్షం ఏర్పాటు చేస్తే సమైక్యాంధ్రకు మద్దతుగా లేఖ ఇస్తామని ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి చెప్పారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోమన్ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తెలుగు ప్రజలను ముంచింది చంద్రబాబేనని వారు అన్నారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయకపోవడం వల్లే సమైక్యాంధ్ర అంటున్నామని వారు తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పడితే ముఖ్యమంత్రి కావొచ్చని కొందరు కేంద్రమంత్రులు, కిరణ్ ఆశలు పెట్టుకున్నారని ఆరోపించారు.
చంద్రబాబుపై మండిపడ్డ వీహెచ్, పొన్నాల
రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబునాయుడు మాట మార్చడం తగదని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు వి. హనుమంతరావు అన్నారు. చంద్రబాబు బస్సు యాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి ఇచ్చిన లేఖకు చంద్రబాబు కట్టుబడి ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, ఎంపీలు సోనియా పెంపుడు కుక్కలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. చంద్రబాబు తన భాష మార్చుకోవాలన్నారు.
తెలుగుజాతి గౌరవాన్ని దిగజార్చేలా చంద్రబాబు వ్యాఖ్యలున్నాయని ఆరోపించారు. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు చంద్రబాబు కట్టుబడి ఉండాలన్నారు. చంద్రబాబు యాత్ర తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర కాదని అది నయవంచన యాత్రని విమర్శించారు.