హైదరాబాద్ యుటి వార్తలపై భగ్గుమన్న టీ నేతలు
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తారని వార్తలపై తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. యుటి అంటే తాటతీస్తామని ఆయన హెచ్చరించారు. అలాంటి ఆలోచన ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన బుధవారం మెదక్ జిల్లాలో మీడియాతో అన్నారు. తమకు దక్కదనిది ఎవరికీ దక్కకూడదనే ఉద్దేశంతో సీమాంధ్ర నాయకులు హైదరాబాద్ను కేంద్రపాలితంగా చేయాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. హైదరాబాద్ను యుటిగా చేయడమంటే రాష్ట్రాన్ని ఖూనీ చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ను కేంద్ర పాలితంగా చేస్తామంటే తాము సహించబోమని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు గండర్ వెంకటరమణారెడ్డి అన్నారు. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే అందరికీ నష్టమేనని ఆయన బుధవారం వరంగల్లో మీడియాతో అన్నారు. ఆంటోనీ కమిటీ ముందు సీమాంధ్ర నాయకులు వినిపించిన వాదనతో సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరుగతుందా అని ఆయన అడిగారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో ఎపి ఎన్జీవోలు తలపెట్టిన సభపై పునరాలోచన చేయాలని ఆయన సూచించారు. సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిల్లిమొగ్గలు వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేస్తే సహించబోమని తెలంగాణ ఉద్యోగుల సంఘం నాయకుడు దేవీప్రసాద్ అన్నారు. ఈ నెల 7వ తేదీన తాము తలపెట్టిన శాంతిర్యాలీకి అనుమతి ఇవ్వకుండా ఎపిఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. హైదరాబాదును అశాంతి నగరంగా మార్చేందుకే ఎపి ఎన్జీవోల సభకు అనుమతి ఇచ్చారని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, దాన్ని అడ్డుకోలేరని సిడబ్ల్యుసి సభ్యుడు సంజీవరెడ్డి బుధవారం కరీంనగర్లో అన్నారు. తాను తెలంగాణవాదినే అని ఆయన అన్నారు.