బ్లాంక్ చెక్కు ఇవ్వలేదు, వక్రీకరణ: విభజనపై మైసురా
కొన్ని పత్రికలు కూడా తమపై విషప్రచారం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. కొన్ని పార్టీలకు ముఖం చెల్లకుండా పోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలని తాము కోరినట్లు తెలిపారు. కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన చూస్తే ఒంటెత్తు పోకడ పోతున్నట్లు ఉందని మైసురా రెడ్డి వ్యాఖ్యానించారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే తమ పార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేసినట్లు చెప్పారు. తండ్రిలా విభజన చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. అందరికీ ఆమోదయోగ్యంగా నిర్ణయం ఉండాలనేది తమ పార్టీ అభిమతమని ఆయన అన్నారు.
తమ పార్టీకి చెందిన 16 మంది శాసనసభ్యులు, ఇద్దరు పార్లమెంటు సభ్యులు స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాలు సమర్పించారని చెప్పారు. తమ పార్టీ నేతలు వైయస్ విజయమ్మ, జగన్ దీక్షలు చేశారని ఆయన చెప్పారు. వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. తమను విమర్శించే ముందు ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ఇతర పార్టీల శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు స్పీకర్ ఫార్మాట్లలో రాజీనామాలు ఇచ్చి ఆయా పార్టీల విధానమేమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
స్పీకర్ను కలిసిన ఎమ్మెల్యేలు
ఇదిలావుంటే, తమ పార్టీ శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్ను కలిసి విజ్ఝప్తి చేశారు. స్పీకర్ ఫార్మాట్లలోనే తాము రాజీనామాలు చేసినట్లు వారు తెలిపారు. రాజీనామాలను పరిశీలించి, నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటానని స్పీకర్ వారికి హామీ ఇచ్చారు. తమ రాజీనామాలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగితే మరోసారి స్పీకర్ను కలుస్తామని వారు చెప్పారు.