ఎలా చెప్తారు: షిండేపై సీమాంధ్ర ఎంపీల ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఓ వైపు చర్చలు సాగుతుండగా 20 రోజుల్లో తెలంగాణపై మంత్రివర్గం నోట్ పెడుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఎలా ప్రకటిస్తారని సీమాంధ్ర కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు ఎకె ఆంటోనీ కమిటీని ప్రశ్నించారు. మంగళవారం రాత్రి వారు ఆంటోనీ కమిటీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులను తెలుసుకుని అర్థం చేసుకునేందుకు, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునేందుకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలతో అఖిలపక్ష కమిటీని వేయాలని ఆంటోనీ కమిటీని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు కోరారు.
తెలంగాణ ఏర్పాటు విషయంలో సీమాంధ్ర ప్రజల మనోభావాలను గుర్తించాలని, ప్రకటనను వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అయితే ఈ నిర్ణయం నుంచి వెనక్కివెళ్లడం సాధ్యమయ్యే పని కాదని, అలా చేస్తే పార్టీ విశ్వసనీయతను కోల్పోతుందని కమిటీ సభ్యులు అన్నట్లు తెలిసింది. దీంతో పార్లమెంటులో ఉన్న అన్ని పార్టీలతో అఖిలపక్ష కమిటీ వేయాలని, ఆ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఎంపీలు సూచించినట్లు తెలిసింది.
ఈ అంశంపై పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మాట్లాడతామని కమిటీ హామీ ఇచ్చిందని, సానుకూల ఫలితం వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఆంటోనీ కమిటీతో భేటీ తర్వాత కేంద్ర మంత్రి పళ్లంరాజు మీడియాతో మాట్లాడారు. ఆంటోనీ కమిటీ ఏమీ చేయడం లేదని ప్రజలు భావిస్తున్నారని కమిటీ సభ్యులకు చెప్పామన్నారు. ఆంటోనీ కమిటీ త్వరగా రాష్ట్రంలో పర్యటించాలని, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని కోరామని, పార్లమెంటు సమావేశాల తర్వాత ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని ఆయన చెప్పారు.
కమిటీ నివేదిక ఇచ్చే వరకూ తెలంగాణ విషయంలో కేంద్రం ముందడుగు వేయకుండా చూడాలని కమిటీ సభ్యులను కోరినట్లు చెప్పారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని ఎవరూ ప్రారంభించలేదని, ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్నారని, నెల రోజులు దాటినప్పటికీ క్షేత్రస్థాయిలో ఉధృతంగా ఉద్యమిస్తున్నారని చెప్పామన్నారు. ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని, నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని సూచించామన్నారు. లేదంటే పార్టీ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని చెప్పామని పళ్లంరాజు చెప్పారు.
కాగా, తాము రాజీనామాలు చేయబోమని కేంద్ర మంత్రి జెడి శీలం చెప్పారు. తాము రాజీనామాలు చేస్తే ఢిల్లీలో విభజనకు వ్యతిరేకంగా మాట్లాడేవారే ఉండబోరని, దానివల్ల నష్టం జరుగుతుందని ఆయన అన్నారు.