కోలుకున్న జగన్: నిమ్స్ నుండి నేడో, రేపో జైలుకు
మంగళవారం సాయంత్రం వైద్యులు పరీక్షలు జరిపారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిందని, సాధారణ స్థాయికి చేరుకుందని తెలిపారు. ఆయన శరీరంలో కీటోన్స్ సాధారణ స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. బిపి, షుగర్, సోడియం నిల్వలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. అయితే, వారం రోజుల పాటు దీక్ష చేసిన కారణంగా నరాలు ఇంకా బలహీనంగా ఉన్నాయని, ఫ్లూయిడ్స్ ఎక్కించాల్సి వచ్చినప్పుడు కష్టంగా ఉందని తెలిపారు.
హిమోగ్లోబిన్(రక్తం) ఇంకా మెరుగు పడాల్సి ఉందన్నారు. పండ్లు, పండ్ల రసాలు, ఘన పదార్థాలు తీసుకుంటే హిమోగ్లోబిన్ పెరుగుదల వేగంగా ఉంటుందని వైద్యులు చెప్పారు.
పలువురు పార్టీ నేతలు నిమ్స్కు వచ్చి వైద్యులను జగన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. జగన్ సతీమణి భారతి మంగళవారం సహాయంగా ఉండేందుకు ఆసుపత్రికి వచ్చారు. ఉదయం ఎనిమిది గంటలకు వచ్చిన ఆమె సాయంత్రం వరకు ఉండి వెళ్లారు. జగన్ను ఇవాళ లేదా రేపు డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి.