ఢిల్లీలో అడ్డేస్తాం, దిగ్బంధిస్తాం: ఎపిఎన్జీవోXఒయు జెఏసి
హైదరాబాద్: ఈ నెల 7వ(శనివారం) తేదిన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఎపిఎన్జీవోల తలపెట్టిన సభ వేడిని రాజేస్తోంది. సభను ప్రశాంతంగా నిర్వహిస్తామని, తెలంగాణవాదులు హెచ్చరికలు సరికానని ఎపిఎన్జీవోలు చెబుతుండగా, సభను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు, ఒయు జెఏసి తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు పోలీసులు సభకు అనుమతిచ్చామని, హద్దు మీరితే రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
బెదిరింపులు సరికాదు: ఎపిఎన్జీవోలు
తమ సభకు తెలంగాణవాదుల బెదిరింపులు సరికాదని ఎపిఎన్జీవోల అధ్యక్షుడు అశోక్ బాబు గురువారం అన్నారు. తమ సభకు ఆహ్వానించిన రాజకీయ పార్టీల వారిని సభకు పోలీసులు అనుమతించాలని కోరారు. ఉద్యోగులకు ఐడి కార్డులు తీసుకోవాలని తాము చెప్పామని అయినా, తమ సభకు ఉద్యోగులే కాకుండా సమైక్యవాదులు వస్తారని, వారిని అనుమతించాలన్నారు. స్టేడియం చుట్టూ సభ పెడతామన్నారు.
తెలంగాణవాదులకు విడిపోవాలని ఉంటే సభను అడ్డుకోవద్దన్నారు. సీమాంధ్రుల సహకారం లేకుంటే తెలంగాణ రాదనే విషయాన్ని తెలంగాణవాదులు గుర్తించాలన్నారు. పోలీసుల తీరులో, ఎల్బీ స్టేడియం అధికారుల తీరులో పక్షపాత ధోరణి కనిపిస్తోందని ఆరోపించారు. ఈ నెల 6న సభ ఏర్పాట్లకు సిద్ధం చేసుకుంటామంటే అనుమతివ్వలేదన్నారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఆయా పార్టీల వ్యక్తులను సభకు అహ్వానిస్తామని చెప్పారు.
బెదిరిస్తే ఢిల్లీ వెళ్లి తెలంగాణను అడ్డుకునే శక్తి ఉందన్నారు. ఏడో తేదిన ఉదయం సూర్యుడు ఉదయిస్తాడని, మధ్యాహ్నం తమ సభ జరుగుతుందని, సాయంత్రం మళ్లీ సూర్యుడు అస్తమిస్తాడని ఓ ప్రశ్నకు సమాధానంగా అశోక్ బాబు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. మరోవైపు హైదరాబాదు పైన తెలంగాణవారికి ఎంత హక్కుందో తమకు అంతే హక్కుందని, సభను అడ్డుకుంటే ఊరుకునేది లేదని సమైక్యాంధ్ర విద్యార్థి జెఏసి హెచ్చరించింది.
మజ్లిస్ సహకారం కోరిన ఎపిఎన్జీవో
హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న సమైక్యాంధ్ర సభకు ఎపిఎన్జీవోలు మజ్లిస్ పార్టీ మద్దతును కోరారు. మజ్లిస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీని కలిసి మద్దతు కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అక్బర్ తెలిపారు.
ఒయు జెఏసి బంద్ పిలుపు
ఎపిఎన్జీవో సభ నేపథ్యంలో సభను అడ్డుకునేందుకు ఒయు జెఏసి ప్రయత్నాలు చేస్తోంది. సభ నిర్వహించే రోజు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా బందుకు పిలుపునిచ్చింది. తమ బందుకు రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని డిమాండ్ చేశాయి. హైదరాబాదులోని సీమాంధ్రులు సభకు వెళ్లవద్దని కోరారు. 7వతేదిన రహదారుల దిగ్బంధానికి పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా కోదాడలో, పాలమూరు జిల్లా అలంపూరులో, వరంగల్ జిల్లా మానుకోటలో రైల్వే స్టేషన్ల దిగ్బంధానికి పిలుపునిచ్చారు. హైదరాబాదులో ర్యాలీలు నిర్వహిస్తామని తెలిపారు. మరోవైపు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా సభను అడ్డుకుంటామని చెప్పారు.
చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దు: సిపి
చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు. ఎపిఎన్జీవోల సభ నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ముందుగా అడిగినందునే ఎపిఎన్జీవోలకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. ఐడి కార్డు ఉన్ వారినే లోపలకు అనుమతిస్తామన్నారు. 19 షరతులతో, అన్ని అంశాలను పరిశీలించాకే అనుమతించామని, ఏమైనా జరిగితే ఏపిఎన్జీవోలదే బాధ్యత అని, ప్రభుత్వ, ప్రయివేటు అస్తులకు నష్టం కలిగించవద్దన్నారు.