సమైక్యంలో చెర్రీ తుఫాన్: చిత్తూరులో మొదటి షాక్!
హైదరాబాద్/చిత్తూరు: సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ సినిమాల పైన పడుతున్నట్లుగా కనిపిస్తోంది. చిరంజీవి రాజ్యసభ సభ్యుడు కాకముందు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన చిత్తూరు జిల్లాలో చెర్రీ సినిమాపై ప్రభావం పడినట్లుగా కనిపిస్తోంది.
తిరుపతిలో రామ్ చరణ్ తేజ తాజా సినిమా తుఫాన్ను ప్రదర్శించవద్దని సమైక్యవాదులు థియేటర్ల యాజమాన్యాలను కోరారు. ప్రదర్శిస్తే మాత్రం అడ్డుకుంటామని చెప్పారు. దీంతో జిల్లాలోని పలమనేరు, చిత్తూరు తదితర ప్రాంతాల నుండి సినిమా ప్రదర్శనకు థియేటర్ యాజమాన్యాలు ముందుకు రాలేదని తెలుస్తోంది.
మంత్రులు ఇళ్ల ముట్టడి
కర్నూలులో కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ ఇళ్లను విద్యుత్ ఉద్యోగులు గురువారం ముట్టడించారు. అంతకుముందు విద్యుత్ భవన్ నుంచి రాజ్ విహార్ కూడలి వరకు ఉద్యోగులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లాలో సమైక్య నిరసనలు కొనసాగుతున్నాయి. 37వరోజు నిరసనలో భాగంగా గురువారం ఉదయం ఉపాధ్యాయులు భారీ ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, తెరాస అధ్యక్షుడు కెసిఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ డిమాండ్ చేశారు.