7 టెన్షన్: బంద్కు టిజెఎసి ప్లాన్, ఒయుజెఎసి వార్నింగ్
సమైక్యాంధ్ర సభకు అనుమతి ఇస్తూ తమకు అనుమతి నిరాకరించడంపై ఆగ్రహంగా ఉన్న తెలంగాణ జెఎసి నాయకులు ఆ రోజు బంద్కు పిలుపు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సమైక్యాంధ్ర సభను దెబ్బ కొట్టడానికి అంతకన్నా మార్గం లేదనే ఉద్దేశంతో తెలంగాణవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ జెఎసి బంద్కు పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), ఓయు జెఎసి, బిజెపి మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. బంద్కు పిలుపునిచ్చి హైదరాబాదుకు వచ్చే మార్గాలను దిగ్బంధం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
గురువారం జరిగే స్టీరింగ్ కమిటీ సమావేశంలో బంద్పై తెలంగాణ జెఎసి నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వం సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తోందనేది 7వ తేదీన ఎపిఎన్జీవోల సభకు అనుమతి ఇవ్వడం ద్వారా అర్థమవుతోందని తెలంగాణవాదులు అంటున్నారు. ఈ విషయంపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు కూడా ఫిర్యాదు చేశారు .
ఎల్బీ స్టేడియంలో జరిగే సీమాంధ్ర సభను తాము అడ్డుకుంటామని, అదే సమయంలో నిజాం కళాశాల మైదానంలో శాంతి ర్యాలీ జరిపి తీరుతామని తెలంగాణవాదులు అంటున్నారు. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ స్వయంగా ఆ మాట అన్నారు. ప్రభుత్వ తీరుపై తెలంగాణ మంత్రి కె. జానా రెడ్డి కూడా మండిపడుతున్నారు. రెండు సభలకు అనుమతి నిరాకరించాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఎపిఎన్జీవోల సభకు వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధపడుతున్నారు. నిజాం కళాశాల మైదానంలో జమై, తెలంగాణ అమర వీరుల స్థూపం వరకు ర్యాలీ నిర్వహించే ఉద్దేశంతో వారు ఉన్నట్లు తెలుస్తోంది. నిజాం కళాశాల, ఎల్బీ స్టేడియం రోడ్డుకు ఇరు వైపులా ఉంటాయి. రెండు ప్రాంతాల శిబిరాలు ఇరు వైపులా మోహరిస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఏడో తేదీన విద్యాసంస్థల బంద్కు ఓయు జెఎసి పిలుపునిచ్చే అవకాశం ఉంది.
ఏడో తేదీన థియేటర్లు మూసేయాలని కూడా ఓయు జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. హైదరాబాద్ వచ్చే సీమాంధ్ర ఉద్యోగులను అడ్డుకోవడానికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.