ఎయిర్హోస్టెస్ గీతిక ఆత్మహత్య కేసు: కందాకు బెయిల్
న్యూఢిల్లీ: మాజీ ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందాకు ఎట్టకేలకు బెయిల్ గురువారం లభించింది. సంవత్సరానికి పైగా ఢిల్లీ జైలులో ఉంటున్న కందా రానున్న అసెంబ్లీ సమావేశాలలో పాల్గొనేందుకు బెయిల్ కోరగా, కోర్టు నెల రోజులు ఇచ్చింది.
ఢిల్లీ అడిషనల్ సెషన్స్ జడ్జి ఎంసి గుప్తా అంతకుముందు కందా బెయిల్ పిటిషన్ను రిజర్వ్లో ఉంచారు. ఇరు వైపుల వాదనలు విన్న అనంతరం బెయిల్ ఇచ్చారు. మరోవైపు గోపాల్ కందాతో పాటు ఈ కేసులో మరో నిందితుడు అరుణ చద్దాకు ఇచ్చిన బెయిల్ పీరియడ్ను తగ్గించాలని ఢిల్లీ పోలీసులు కోర్టును కోరారు. అరుణ చద్దాకు కోర్టు నవంబర్ 11వ తేది వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
కాగా, గోపాల్ కందా హర్యానాలో ఎమ్మెల్యేగా ఉన్నారని, అతను వచ్చే శాసన సభ సమావేశాలలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని కందా తరఫు లాయర్ రమేష్ గుప్తా వాదించారు.
గోపాల్ కందా సిర్సా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని, ఇతను తన ప్రజలకు పలు సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరముందని, నియోజకవర్గానికి వచ్చిన నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉందని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లాయర్ చెప్పారు.
గత పద్నాలుగు నెలలుగా కందా కస్టడీలో ఉన్నారని, ఆయనను పోలీసులు పలుమార్లు విచారించారని అలాంటప్పుడు ఆయనకు బెయిల్ ఇచ్చినా కేసు పైన ఎలాంటి ప్రభావం పడదని చెప్పారు.