జగన్ కేసులో ఛార్జీషీట్!: మోపిదేవి బెయిల్ పిటిషన్
ఎంత మంది సాక్షులను విచారించారు? ఎవరెవరిని నిందితులుగా చేర్చారు? ఏ ఏ ఆధారాలు సేకరించారు? ఎన్ని డాక్యుమెంట్లను చార్జిషీట్కు జత చేశారు? తదితర వివరాలను డిజికి వివరించి ఆమోదముద్ర తీసుకున్నారట. జగన్ అక్రమాస్తులకు సంబంధించి ఇప్పటికే ఐదు చార్జిషీట్లతో పాటు వాటికి కొన్ని అనుబంధ చార్జిషీట్లును సిబిఐ కోర్టులో వేశారు. అయితే, ఆరు నెలల క్రితం సుప్రీం కోర్టులో బెయిల్ కోసం జగన్ ప్రయత్నించగా దర్యాప్తు అధికారులు అభ్యంతరం చెప్పారు.
అనుబంధ చార్జిషీట్లు కాకుండా అన్నీ కలిపి తుది చార్జిషీటును సెప్టెంబర్లోగా దాఖలు చేయాలని ఈ సందర్భంగా న్యాయస్థానం సూచించినట్లు వార్తలు వెలువడ్డాయి.(తమను కోర్టు ఆదేశించలేదని అప్పట్లో సిబిఐ జెడిగా ఉన్న లక్ష్మీనారాయణ ప్రకటించారు) ఈ మేరకు ఈ నెల 7లోగా జగన్ అక్రమాస్తుల కేసులో తుది చార్జిషీటును సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే 7 శనివారం కావడంతో ఒకరోజు ముందుగానే చార్జిషీటు సమర్పణకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇటీవలి సిబిఐ అధికారులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిలను విచారించి అభియోగాలు మోపారు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి గీతా రెడ్డిని సైతం ఇటీవలే ప్రశ్నించారు. కాగా ఇప్పుడు కోర్టుకు సమర్పించేది తుది చార్జిషీటు కాకపోవచ్చని, కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున కోర్టు అనుమతితో మరికొన్ని చార్జిషీట్లు వేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం.
మోపిదేవి బెయిల్ పిటిషన్
నాంపల్లి కోర్టులో మాజీ మంత్రి, జగన్ ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మోపిదేవి వెంకటరమణ గురువారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వెన్నునొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలతో మాజీ మంత్రి మోపిదేవి ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని కేర్ వైద్యులు చెప్పారు. ఆ నివేదికను జత చేసి మోపిదేవి నాంపల్లి సిబిఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కొద్ది రోజుల క్రితం వైద్య పరీక్షల నిమిత్తం తనను చంచల్గూడ జైలు అధికారులు కేర్ ఆస్పత్రికి తీసుకెళ్లారని తనకు వెన్ను ఆపరేషన్ చేయాల్సిన అవసరాన్ని వారు గుర్తించి హెచ్చరించారని తెలిపారు.