చెర్రీ తుఫాన్: పోస్టర్స్ తగులబెట్టారు, చిరు సొంతూర్లోను
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నటించిన తుఫాన్ సినిమాను సమైక్యవాదులు శుక్రవారం పలుచోట్ల అడ్డుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సమైక్యవాదులు తుఫాన్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు వెళ్లి పోస్టర్స్ చించివేశారు. సినిమాను అడ్డుకున్నారు.
కర్నూలు జిల్లా కోడుమూరులో, చిత్తూరు జిల్లా తిరుపతి సత్యవేడులలోను సమైక్యవాదులు సినిమాను అడ్డుకున్నారు. నర్సాపురం, పాలకొల్లులలో థియేటర్ల వద్ద సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. బెనిఫిట్ షో వేయకుండా అడ్డుకున్నారు. థియేటర్ల వద్ద పోస్టర్స్ తగులబెట్టారు. చిరంజీవి స్వగ్రామమైన మొగల్తూరులోను తుఫాన్కు సమైక్య సెగ తగిలింది. పలువురు సమైక్యవాదులు తుఫాన్ సినిమా థియేటర్ ముందు నిరసనకు దిగారు.
మరోవైపు, తెలంగాణలోను చిరంజీవి కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని తెలంగాణవాదులు హెచ్చరించిన విషయం తెలిసిందే. వరంగల్ జిల్లా నర్సంపేటలో సమైక్యవాదులు రామ్ చరణ్ తేజ తుఫాన్ సినిమాను అడ్డుకుంటామని గురువారం హెచ్చరించారు.
కాగా, చిరంజీవి తెలంగాణకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కోసం ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణవాదులు, సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేయక పోవడం వల్ల సమైక్యవాదులు ఆయన కుటుంబ సభ్యుల సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు.