విభజన సెగ: తుఫాన్ను అడ్డుకున్న ఆందోళనకారులు
హైదరాబాద్: రామ్ చరణ్ తేజ, ప్రియాంక చోప్రా జంటగా నటించిన 'తుఫాన్' సినిమాకు సమైక్య సెగతో పాటు తెలంగాణ సెగ కూడా తగిలింది. కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు హీరో రామ్చరణ్ నటించిన 'తుఫాన్' సినిమా శుక్రవారం ఉదయం విడుదలైంది. తెలంగాణ, సీమాంధ్ర జిల్లాలో సినిమా ప్రదర్శనలను కొన్ని చోట్ల ఆందోళనకారులు అడ్డుకున్నారు. సినిమా పోస్టర్లను దగ్దం చేశారు.
సీమాంధ్ర జిల్లాలైన కర్నూలు, అనంతపురం, తిరుపతిలో సినిమాను అడ్డుకోగా, తెలంగాణ జిల్లాలోని వరంగల్, కరీంనగర్ల్లో సినిమాను తెలంగాణవాదులు అడ్డుకున్నారు. సీమాంధ్రలోని కర్నూలు జిల్లా కొడమూరు, ఎమ్మిగనూరులో 'తుఫాన్' సినిమాను సమైక్యవాదులు అడ్డుకున్నారు. నంద్యాల, డోన్లో తుఫాన్ సినిమా ప్రదర్శనను థియేటర్ యజమానులు నిలిపివేశారు.
కాగా, అనంతపురం జిల్లా ఉరవకొండలో 'తుఫాన్' సినిమా ప్రదర్శనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అదే విధంగా చిత్తూరు జిల్లాలోని సత్యవేడులో 'తుఫాన్' సినిమాను సమైక్యవాదులు అడ్డుకున్నారు. అయితే, చిత్తూరు జిల్లాలో సినిమాకు కాస్తా ఊరట లభించింది. చిత్తూరు జిల్లాలోని థియేటర్లలో ఫస్ట్ షో నుంచి సినిమాను ప్రదర్శిస్తున్నారు.
తెలంగాణలోని వరంగల్ జిల్లాలో తుఫాన్ సినిమాకు తెలంగాణ సెగ తగిలింది. మహబూబాబాద్లో తూఫాన్ ప్రదర్శనను నిలిపివేశారు. నర్సంపేటలో తుఫాన్ సినిమా పోస్టర్ను దగ్దం చేశారు. కరీంనగర్ జిల్లాలోని ప్రతిమ మల్టీప్లెక్స్లో హీరో రామ్చరణ్ నటించిన 'తుఫాన్' సినిమాను అడ్డుకునేందుకు కుల సంఘాల జేఏసీ నేతలు యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. హుజూరాబాద్లోని అన్నపూర్ణ, నటరాజ్ థియేటర్లలో తుఫాను సినిమాను తెలంగాణవాదులు అడ్డుకునేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో వాగ్వాదం చెలరేగింది.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో సమైక్యవాదులు తుఫాన్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ వద్దకు వెళ్లి పోస్టర్స్ చించివేశారు. సినిమాను అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో సినిమాను అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. నర్సాపురం, పాలకొల్లులలో థియేటర్ల వద్ద సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. బెనిఫిట్ షో వేయకుండా అడ్డుకున్నారు. థియేటర్ల వద్ద పోస్టర్స్ తగులబెట్టారు. చిరంజీవి స్వగ్రామమైన మొగల్తూరులోను తుఫాన్కు సమైక్య సెగ తగిలింది. పలువురు సమైక్యవాదులు తుఫాన్ సినిమా థియేటర్ ముందు నిరసనకు దిగారు.