అడ్డుకోవడంపై ఆరా: ఉండవల్లి, ఇప్పుడే ఇలా..: వీరశివా
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎంపీలు సభలో నిన్న(గురువారం) తనను మాట్లాడకుండా ఎందుకు అడ్డుకున్నారోనని అందరూ ఆరా తీస్తున్నారని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ శుక్రవారం అన్నారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తమను అడ్డుకోవడం ద్వారా తెలంగాణ సాధించలేరని, అందరి అనుమతితోనే తెలంగాణ ఏర్పడాల్సి ఉందన్నారు. తమను సభలో, బయట అడ్డుకుంటే తెలంగాణ వస్తుందనుకోవడం తప్పన్నారు.
గతంలో రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఇరు ప్రాంతాలలో అభ్యంతరం లేదని, తెలంగాణ విషయంలో మాత్రం సీమాంధ్ర ప్రాంతం వారు విడిపోవాలని కోరుకోవడం లేదన్నారు. ఏకాభిప్రాయంతోనే విభజన సాధ్యమన్నారు. నిన్నటి తన స్పీచ్లో ఇందిరా గాంధీ మాట్లాడిన విషయమే చెప్పానని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పిన విషయం చెప్పలేదని తెలంగాణ ఎంపీలు ప్రశ్నించినట్లుగా మీడియాలో చూశానని అన్నారు.
అయితే, సోనియా గాంధీ 2009 ఫిబ్రవరి 28న జై ఆంధ్రప్రదేశ్ అన్నారని వారు గుర్తుంచుకోవాలని సూచించారు. కాంగ్రెసు ఎప్పుడు తెలంగాణపై హామీ ఇవ్వలేదన్నారు. 2004లో తాము ఎస్సార్సీ అని చెప్పామని, 2008లో తెలంగాణ ప్రజల మనోభావాలు గౌరవిస్తున్నామని చెప్పామన్నారు. ఇప్పటికీ వారి మనోభావాలను గౌరవిస్తున్నామని అయితే, చొక్కా పట్టుకొని గౌరవం ఇవ్వాలంటే ఎలా అన్నారు.
సిడబ్ల్యూసి ప్రకటన వెలువడిన వెంటనే సీమాంధ్రలో ఎందుకు అంత ఆందోళనలు వస్తున్నాయో గమనిస్తున్నారన్నారు. సీమాంధ్ర ప్రజల డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రజల మధ్య రాజకీయ నాయకులు వైషమ్యాలు రెచ్చగొట్టవద్దని కోరారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాలంటే తెలంగాణ కోరుకునే వారు సంయమనంతో, నమ్రతతో వ్యవహరించాలని సూచించారు.
అసెంబ్లీలో తీర్మానం పొందితేనే లోకసభలో తీర్మానం సాధ్యమన్నారు. అందరి అనుమతితోనే తెలంగాణ వస్తుంది తప్ప ఒక ప్రాంతం వారి కోరికతో కాదన్నారు. ఏకాభిప్రాయం తప్పనిసరి అన్నారు. రెచ్చగొట్టే చర్యల ద్వారా అసెంబ్లీలో బిల్లు పాస్ కాదని తెలుసుకోవాలన్నారు. ఎవరి అభ్యంతరాలను వాళ్లను చెప్పుకోనివ్వాలని సూచించారు. ఇలా రెచ్చగొడితే తెలంగాణ బిల్లు ఎప్పటికీ ఆమోదం పొందదన్నారు. ఇరు ప్రాంత నేతలు సమస్యలు కూర్చొని చర్చించుకోవాలన్నారు.
అవకాశమివ్వరా?: వీరశివా
ఉరిశిక్ష పడిన వారు కొన్ని కోరికలు కోరుకుంటారని, తమకు ఆ అవకాశం కూడా ఇవ్వరా అని కమలాపురం కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే వీరశివా రెడ్డి తెలంగాణవారిని ప్రశ్నించారు. ఉండవల్లి సభలో మాట్లాడుతుంటే టిఎంపీలు అడ్డుకోవడమేమిటన్నారు. ఎపిఎన్జీవోల సభ రోజే తెలంగాణవాదుల శాంతిర్యాలి సమంజసం కాదన్నారు.
సభకు తమ మద్దతుందన్నారు. రాబోయే కాలంలో కలిసి ఉండాలని కోరుకునే వారు ఇలాగేనే చేసేదన్నారు. విడిపోవాలని కోరుకునే స్వేచ్ఛ మీకు ఎంతగా ఉందా, సమైక్యం కోరుకునే స్వేచ్ఛ తమకు అంతే ఉందన్నారు. విభజనకు ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే తర్వాత ఎలా ఉంటుందోని ఆందోళన వ్యక్తం చేశారు.