కానిస్టేబుల్ జై తెలంగాణ: కోదండరామ్ అరెస్టు
హైదరాబాద్: ఏపీ ఎన్జీవోలు ఎల్బీ స్టేడియంలో తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో జై తెలంగాణ అన్నందుకు పోలీసు కానిస్టేబుల్పై దాడి చేయడం దుర్మార్గమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ అన్నారు. కానిస్టేబుల్ పై జరిగిన దాడిని ఆయన ఖండించారు. ఆత్మగౌరవం సీమాంధ్ర ఉద్యోగులకే ఉంటుందా? తెలంగాణ ఉద్యోగులకు ఉండదా అని వారు ప్రశ్నించారు.
భావ ప్రకటన స్వేచ్ఛ ఉందన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుల్ పై దాడి చేయడాన్ని ఎలా సమర్థిస్తారన్నారు. దాడికి గురైన కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నాడో డీజీపీ తెలియజేయాలని, అతనికి ఆస్పత్రిలో చికిత్స చేయించాలని హరీశ్ రావు, ఈటెల అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీవోల మాటలు తెలంగాణ ప్రజలను అవమానపర్చేలా ఉన్నాయని వారన్నారు. సీమాంధ్రులకు కావాల్సింది తెలంగాణ ప్రజల శ్రేయస్సు కాదని, వనరుల దోపిడీ మాత్రమే అని వారన్నారు.
ఎపి ఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభలో ఓ కానిస్టేబుల్ జై తెలంగాణ నినాదాలు చేశాడు. అతనిపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ కానిస్టేబుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓయు జెఎసి నాయకుడు బాలరాజుపై సీమాంధ్రులు దాడి చేశారు. ఎల్బీ స్టేడియం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ వద్ద దీక్ష చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు శనివారం సాయంత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును పరామర్శించారు.
ఎపి ఎన్జీవోలు నిర్వహించిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ సందర్భంగా అరెస్టయిన తెలంగాణవాదులను పరామర్శించడానికి వెళ్లి తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ను పోలీసులు అరెస్టు చేశారు. సమైక్య సభను నిరసిస్తూ శనివారం ఆందోళనకు దిగిన తెలంగాణవాదులను పోలీసులు అరెస్టు చేశారు. ఎపి ఎన్జీవోల ఎపి సేవ్ సభను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఎమ్మార్పీయస్ కార్యకర్తలు సచివాలయం వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
తెలంగాణ బంద్ విజయవంతం
తెలంగాణ వ్యాప్తంగా బంద్ విజయవంతమైందని తెలంగాణ రాష్ట సమితి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో తెలంగాణవాదులు చేపట్టాలనుకున్న శాంతి ర్యాలీకి ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతో తెలంగాణ బంద్కు తెలంగాణ జేఏసీ పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బంద్ సంపూర్ణమైందని అన్నారు. బంద్లో పాల్గొన్న వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అసెంబ్లీ ఆవరణలో సీమాంధ్ర ఎమ్మెల్యేలు దీక్ష చేసేందుకు అనుమతించిన ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలకు అనుమతివ్వకపోవడం దారుణమని ఆయన అన్నారు. తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, డీజీపీ దినేష్ రెడ్డిల వైఖరికి నిరసనగా చేపట్టాలనుకున్న శాంతి దీక్షకు అనుమతివ్వకపోగా అసెంబ్లీ గేటు దగ్గర పోలీసులు అడ్డుకున్నారని అన్నారు. ఇది తమను అవమానించే చర్యగా భావిస్తున్నట్లు తెలిపారు.
ఎపి ఎన్జీవోల సేవ్ ఆంధ్రప్రదేశ్ సందర్పంగా నిజాం కళాశాల హస్టల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. హాస్టల్ విద్యార్థులు కొంత మంది భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థి కాలు జారి కింద పడ్డాడు. అతను తీవ్రంగా గాయపడ్డాడు. దాంతో అతన్ని అస్పత్రికి తరలించారు.