ఏపీ ఎన్జీవోల సభ: నిజాం కాలేజీలో ఉద్రిక్తత, అరెస్టులు
హైదరాబాద్: నిజాం కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం ఎల్బీ స్టేడియంలో ఏపీ ఎన్జీవోల సమావేశం దృష్ట్యా నిజాం కాలేజీలో ఉన్న నాన్ బోర్డర్ విద్యార్థులను వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు. తర్వాత పోలీసులు నిజాం కాలేజీలో ప్రవేశించి నాన్ బోర్డర్స్ను స్వయంగా ఖాళీ చేయించారు. ఈ సందర్భంలో పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు.
పోలీసుల తీరు పట్ల కొందరు విద్యార్థులు నిజాం కాలేజీ భవనంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. మరికొందరు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. భారీ ఎత్తున చేరుకున్న విద్యార్థులు జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఏపీ ఎన్జీవోల సభను అడ్డుకుంటారనే నెపంతో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విద్యార్థి విభాగం నాయకుడు సుమన్తోపాటు పలువురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. మిగితా కాలేజీ విద్యార్థులను కాలేజీ లోపలికి పంపించేశారు.
కాగా తెలంగాణ పొలిటికల్ జేఏసీ పిలుపు మేరకు శనివారం తెలంగాణ వ్యాప్తంగా బంద్ కొననసాగుతోంది. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూతపడ్డాయి. తెలంగాణ జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
హైదరాబాద్ నగరంలో ఒక్క ఆర్టీసీ బస్సు కూడా రోడ్డుపైకి రాలేదు. బంద్ కారణంగా నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లు కూడా రద్దయ్యాయి. తెలంగాణ జిల్లాల్లో తెలంగాణవాదులు ఆందోళనలకు దిగారు. తెలంగాణ బంద్లో భాగంగా సింగరేణి కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు.
సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పటికే చాలా వరకు ఎల్బీ స్టేడియం వద్దకు చేరుకున్నారు. గుర్తింపు కార్డులు చూసి ఉద్యోగులను పోలీసులు లోనికి అనుమతిస్తున్నారు.