అసెంబ్లీ వద్ద తెరాస ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్: తెలంగాణపై ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, డీజీపీ దినేష్రెడ్డిల వైఖరికి నిరసనగా రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో శాంతి దీక్ష చేపట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు నిర్ణయించారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, పోచారం శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీ దగ్గరకు చేరుకున్నారు. అయితే పోలీసులు వారిని అసెంబ్లీలోనికి వెళ్లకుండా గేటు దగ్గరే అడ్డుకున్నారు.
మరో ఎమ్మెల్యే లింగారెడ్డి తన భార్యతో కలిసి అసెంబ్లీకి చేరుకోగా వారినీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం దగ్గర నివాళులర్పించేందుకు ఎమ్మెల్యేలు ప్రయత్నించగా అధికారులు అనుమతించలేదు.
ఇది టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల హక్కులను కాలరాసిన చీకటి సందర్భమని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించకుండా అవమానించే చర్యలను ఖండిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో సీమాంధ్ర ఎమ్మెల్యేల దీక్షకు అనుమతించిన ప్రభుత్వం తెలంగాణ ఎమ్మెల్యేల దీక్షకు అనుమతించకపోవడం దారుణమని ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. మేం రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా కాదా అని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిని ప్రశ్నించారు.
మరోవైపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏపీ ఎన్జీవోలు తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు భారీ సంఖ్యలో సీమాంధ్ర ఉద్యోగులు తరలివస్తున్నారు. సీమాంధ్రలోని 13 జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చిన ఉద్యోగులు భారీ ర్యాలీగా ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. సభలో చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు సమైక్యవాదులను ఆకట్టుకునేలా ఉన్నాయి.