సమైక్య బస్సులపై రాళ్లదాడి, ధ్వంసం: ఎస్కార్ట్తో రిటర్న్
హైదరాబాద్: సీమాంధ్ర బస్సుల పైన పలువురు శనివారం రాత్రి రాళ్లతో దాడి చేశారు. ఎపిఎన్జీవోల సభ కోసం వచ్చి తిరిగి వెళుతున్న సమయంలో బస్సులపై నగర శివార్లలో గుర్తు తెలియని యువకులు రాళ్ల దాడి చేశారు. ఆరు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఇద్దరు సీమాంధ్ర ఉద్యోగులు గాయపడ్డారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు హాజరైన ఉద్యోగులు తిరుగు ప్రయాణంలో ఉండగా బస్సులు నగర శివార్లకు చేరుకోగానే హయత్నగర్, లక్ష్మారెడ్డిపాలెం, రామోజీ ఫిల్మ్సిటీ, ఇనాంగూడ ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి.
దాడుల్లో హయత్ నగర్ ఆర్టీసీ కాలనీ వద్ద ఓ బస్సు, లక్ష్మారెడ్డిపాలెం వద్ద రెండు బస్సులు, రామోజీ ఫిల్మ్సిటీ గేటు వద్ద రెండు బస్సుల అద్దాలు పగిలాయి. ఆర్టీసీ కాలనీ వద్ద బస్సులు ధ్వంసమైన ఘటనలో రాజమండ్రి సీటీవో కార్యాలయంలో పని చేస్తున్న సత్యనారాయణ, వెంకటేశ్వర్ గాయపడ్డారు. సత్యనారాయణ దవడకు బలమైన గాయం కాగా వెంకటేశ్వర్కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
దీంతో రామోజీ ఫిల్మ్సిటీ వద్ద సీమాంధ్ర ఉద్యోగులు బస్సులు నిలిపివేసి విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. అదే సమయంలో కొంతమంది తెలంగాణవాదులు అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ, సమైక్య వాదులు పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు. సీమాంద్రులను బస్సు ఎక్కించి పంపించారు.
ఇంతలో లక్ష్మారెడ్డిపాలెం వద్ద మరో రెండు బస్సుల అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో సీమాంద్రులు బస్సుల్లోంచి దిగి జాతీయ రహదారిపై రాస్తా రోకో చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. సీమాంధ్ర బస్సులకు ఎస్కార్టు ఏర్పాటు చేసి పంపించారు.
సాగర్ రింగురోడ్డు చౌరస్తాలో నూజివీడు డిపోకు చెందిన ఓ బస్సు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు పగులగొట్టారు. ఈ ఘటనలో డ్రైవర్కు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో బస్సు అద్దాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఎన్జీవోలు వెళుతున్న బస్సుపై రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తర్వాత కొందరు తెలంగాణవాదులు జై తెలంగాణ నినాదాలు చేస్తూ రాళ్లతో దాడి చేశారు.
ఈ ఘటనలో బస్సు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. డ్రైవరు సురేశ్కు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, సీమాంధ్ర ఉద్యోగుల బస్సులపై చౌటుప్పల్ మండల కేంద్రంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడులు చేశారు. హైదరాబాద్ నుంచి బయల్దేరిన బస్సులు కొన్ని ముందుకు వెళ్లిపోగా, రెండు వెనకబడ్డాయి. జాతీయ రహదారికి పక్కనే ఉన్న భవనాలపై నుంచి కొందరు వ్యక్తులు వాటిపై శనివారం రాత్రి రాళ్లు రువ్వారు. బస్సులపై దాడిని ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఖండించారు.