కెసిఆర్ ఏలుకో: ఆకట్టుకున్న సత్యవాణి, కిరణ్ ఆసక్తి
సభలో సత్యవాణి మాట్లాడుతూ... కావాలంటే ఓ పదిహేనేళ్లు రాష్ట్రాన్ని ఏలుకో అంతేకానీ, రాష్ట్రాన్ని మాత్రం విభజించవద్దని తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉద్దేశించి అన్నారు. 'భారత, రామాయణాల్లో కర్ణుడు, మారీచుడు, భీష్ముడు అని ముగ్గురున్నారు. కర్ణుడు మంచివాడైనా ఉద్యోగం కోసం దుర్యోధనుడి వద్ద చేరాడు. కానీ దుర్యోధనుడి మాటలు విని బలైపోయాడు.
అలాగే ప్రధాని మన్మోహన్ సింగ్ మంచివాడు, తెలివైనవాడైనప్పటికీ ఉద్యోగిగా మాత్రమే వ్యవహరిస్తున్నందు వల్ల బలైపోతున్నారు. కర్ణుడికి, ఆయనకు తేడా లేదు. అన్నీ తెలిసిన మారీచుడు కూడా రావణాసురుడు చెప్పినట్లు విని ఓ దుష్టశక్తిగా మిగిలిపోయాడు. కెసిఆర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్నీ తెలిసినప్పటికీ విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నాడు.
బతకమ్మ అంటే బతుకును కోరే తల్లి. అన్ని ప్రాంతాల వాళ్లూ ఆమెను కొలుచుకుంటారు. అలాంటి బతకమ్మను కూడా ఒక ప్రాంత చట్రంలో బంధించింది కెసిఆర్ కూతురు. ఇదేనా సంస్కృతి? తెలంగాణ ప్రజలది గొప్ప హృదయం. అలాంటి వారిని కూడా కెసిఆర్ తన మాటలతో విషపూరితం చేస్తున్నాడు' అని సత్యవాణి ప్రసంగం ఉద్వేగపూరితంగా సాగింది.
తాను ఈ సభకొస్తుంటే కొందరు తెలంగాణ అక్కచెల్లెళ్లు కలిశారని, కాలే కడుపుతో వస్తున్నందున భోజనం పెట్టాలని ఉన్నా, ఇంటికి పిలిస్తే తెలంగాణ వ్యతిరేకులంటారనే భయంతో పిలవలేకపోతున్నామని వాపోయారని సత్యవాణి చెప్పారు. తోటి తెలుగు వారిపై ఎవరికీ కోపం ఉండదని, రాజకీయ ప్రయోజనాల కోసమే కొందరు తెలంగాణ నేతలు అలా మాట్లాడుతున్నారన్నారు.
"యుద్ధంలో సోదరులందరినీ పోగొట్టుకున్న దుర్యోధనుడు వద్దకు వచ్చిన ధర్మరాజు.. 'మనం, మనం కొట్టుకుని సోదరులు విడిపోయారన్న చెడ్డ పేరు ఎందుకు? కావాలంటే నా రాజ్యం నీకిస్తాను. అందరం కలిసుందాం' అని కోరాడు. ఇప్పుడూ మేం అదే చెబుతున్నాం. కెసిఆర్ కావాలనుకుంటే రాష్ట్రాన్ని పదిహేనేళ్లపాటు ఏలుకోవడానికి మాకు అభ్యంతరం లేదు. మేమిచ్చేస్తాం. కానీ తెలుగు నేలను మాత్రం చీల్చకండి. చేతులెత్తి నమస్కరిస్తున్నా'' అని అన్నారు. ఈ వినాయక చవితికైనా కెసిఆర్కు, కోదండరామ్కు మంచి బుద్ధి రావాలని దేవుడిని వేడుకుంటున్నాని ఆమె అన్నారు.