ఖైరతాబాద్ గణేషుడికి 4టన్నుల తాపేశ్వరం మహాలడ్డు
తాపేశ్వరంలో 100 మంది కార్మికులు 21 రోజుల పాటు నియమ నిష్ఠలతో, భక్తి శ్రద్ధలతో నాలుగు వేల కిలోల భారీ లడ్డును తయారు చేశారు. మొదటగా 200 కిలోల నుంచి ప్రారంభమైన లడ్డు అంచెలంచెలుగా పెరుగుతూ ఇప్పుడు 4 వేల కిలోలకు చేరింది.
కాగా, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఖైరతాబాద్ గణేశుడు సోమవారం కొలువు దీరాడు. హైదరాబాదులోని ఖైరతాబాద్లో గోచతుర్ముఖ వినాయకుడు కొలువు దీరాడు. ఈ వినాయకుడికి గవర్నర్ నరసింహన్ దంపతులు సోమవారం ఉదయం తొలి పూజలు నిర్వహించారు. గవర్నర్ దంపతులకు పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్ శాలువా కప్పి ఆహ్వానం పలికారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా విగ్రహాన్ని రూపొందించిన శిల్పిని గవర్నర్ సత్కరించారు. ప్రతి యేటా వివిధ రూపాల్లో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాది గోచతుర్ముఖ రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఓ వైపు శ్రీరామ పట్టాభిషేకం, మరో వైపు శక్తి మాత కొలువు దీరారు. భారీ రూపంలో దర్శనమిచ్చే గణనాథుడికి అంతే స్థాయిలో లడ్డూను తయారు చేశారు. నాలుగు వేల కేజీల లడ్డూను వినాయకుడి చేతిలో పెట్టారు.