కుట్ర చేసినా సోనియా టికే, సమైక్యాంధ్ర ఓ కల: యాష్కీ
హైదరాబాద్: ఎవరెన్ని కుట్రలు చేసినా తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చి తీరుతారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ మంగళవారం అన్నారు. సిఎల్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల భేటీ అనంతరం యాష్కీ మాట్లాడారు.
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఆగదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా సోనియా తెలంగాణ ఇచ్చి తీరుతారన్నారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఉత్తర కుమార ప్రగల్భాలకు తాము భయపడేది లేదన్నారు. తెలంగాణ ఒక నిజం అన్న యాష్కీ, సమైక్యాంధ్ర కల అన్నారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాదును తెలంగాణ నుండి వేరు చేసే ఆలోచన కేంద్రానికి ఏమాత్రం లేదన్నారు. హైదరాబాదు తెలంగాణలో లేకుంటే ఈ ప్రాంతం ఆర్థికంగా నిలదొక్కుకోలేదన్నారు. హైదరాబాదు తెలంగాణలో అంతర్భాగమన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రా లేక సీమాంధ్రకా చెప్పాలన్నారు.
తెలంగాణ ప్రజల్లోని సెంటిమెంట్ దృష్ట్యా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వారి అభిప్రాయాన్ని కేంద్రం వద్దకు తీసుకు వెళ్లాలని ప్రభుత్వ చీప్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. తెలంగాణపై అసెంబ్లీ తీర్మానానికి వస్తే ఓటింగ్ అవసరం రాదన్నారు. అభిప్రాయం మాత్రమే తీసుకుంటుందన్నారు.