పోలవరానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్: పిటిషన్ల కొట్టివేత
పోలవరం ప్రాజెక్టు టెండర్లపై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి టెండర్లను కేటాయించింది. ఈ కంపెనీకి అనుకూలంగా హైకోర్టు నిర్ణయం వెలువరించింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకి టెండర్లను అప్పగించడాన్ని సవాల్ చేస్తూ సోమ కంపెనీ నిరుడు నవంబర్లో పిటిషన్ దాఖలు చేసింది. ఆ తర్వాత మధుకాన్, మహాలక్ష్మి కంపెనీలు ఇంప్లీడ్ అయ్యాయి.
పోలవరం ప్రాజెక్టు టెండర్లపై ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని, ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టు కాబట్టి దాన్ని నిలువరించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించి టెండర్లను సాధించిందని పిటిషనర్లు ఆరోపించారు. అయితే, తాము సమర్పించిన పత్రాలన్నీ సరైనవేనని ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ వాదించింది.
గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపడుతామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పోలవరం ప్రాజెక్టును తెలంగాణవాదులు వ్యతిరేకిస్తున్నారు. దాని డిజైన్ మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు.