పాలమూరు, టి బంద్: విభేదాలకు జెఏసి, బిజెపి చెక్
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి, భారతీయ జనతా పార్టీల మధ్య విభేదాలు తొలగిపోయాయి. పాలమూరు ఉప ఎన్నిక సమయం నుండి విభేదాలు పొడసూపాయి. మంగళవారం ఐకాస చైర్మన్ కోదండరామ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, తదితర నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణపై భవిష్యత్ కార్యాచరణకు ఐకాస సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. అనంతరం ఐకాస స్టీరింగ్ కమిటీ భేటీకి బిజెపి నేతలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్నగర్ ఎన్నికల్లో జెఏసి తటస్థంగా ఉండటం పొరపాటేనంటూ మైనారిటీలతో ఓ భేటీలో కోదండరాం అన్నట్లు వచ్చిన వార్తలపై బిజెపి నేతలు తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయితే, తానలా మాట్లాడలేదని ఆయన బదులివ్వగా, ఆ మేరకు ప్రచురితమైన కథనాలు వారు చూపారు.
అలా వ్యాఖ్యానించకపోతే ఈ వార్తలను అప్పుడే ఎందుకు ఖండించలేదని నిలదీశారు. అయితే, జెఏసిలో నిర్ణయించకుండా సొంత అభిప్రాయం ఎలా చెబుతానని కోదండరాం సముదాయించారు. ఇక సీమాంధ్ర జిల్లాల్లో బిజెపి కార్యాలయాలపై దాడులను జెఏసి ఖండించకపోవడాన్ని నిరసించారని తెలిసింది. మరోవైపు పార్లమెంటులో వెంకయ్య నాయుడు ప్రసంగం, సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్పై సుష్మాస్వరాజ్ వ్యవహరించిన తీరు ప్రజలకు మరో రకమైన సంకేతాలు పంపినట్లు జెఏసి నేతలు ప్రస్తావించారు.
అయితే, వెంకయ్య తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదన్న సంగతి ఆయన ప్రసంగం పూర్తిపాఠం వింటే ఇది అర్థమవుతుందని బిజెపి చెప్పారు. అలాగే బిఏసిలో నిర్ణయానికి వ్యతిరేకంగా సస్పెండ్ చేసినందుకే నిరసన తెలిపినట్లు వివరించారు. తెలంగాణ బంద్కు బిజెపి పూర్తి మద్దతు ఇవ్వకపోవడంపైనా జెఏసి నేతలు ప్రశ్నించగా, తమ జాతీయ పార్టీ కాబట్టి, ఆ విధానాలకు లోబడక తప్పదని కిషన్ రెడ్డి చెప్పారు.