కార్యర్తలకు సోషల్ మీడియాపై బొత్స పాఠాలు
హైదరాబాద్: రాజకీయ నాయకులు క్రమంగా సోషల్ మీడియా వైపు దృష్టి సారిస్తున్నారు. ప్రచారంలో సోషల్ మీడియా ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు. ప్రదేశ్ కాంగ్రెసు పార్టీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా దాన్ని ప్రాధాన్యాన్ని గుర్తించినట్లున్నారు. అందుకే పార్టీ కార్యర్తలకు ఆయన బుధవారం సోషల్ మీడియాపై పాఠాలు చెప్పారు.
సోషల్ మీడియాపై ఆయన గాంధీభవన్లో కాంగ్రెసు కార్యకర్తలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పార్టీ శ్రేణులకు కొంత సమాచార లోపం ఉందని, సోషల్ మీడియా ద్వారా దాన్ని సరి చేస్తామని ఆయన చెప్పారు. రాజకీయ ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టేందుకు సోషల్ మీడియాను విరివిగా వాడుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలకు చెందిన కాంగ్రెసు నాయకులకు సోషల్ మీడియాపై శిక్షణాతరగతులను ఆయన బుధవారం గాంధీభవన్లో ప్రారంభించారు. కాంగ్రెసు పార్టీ చేపడుతున్న అభివృద్ధి పథకాలకు ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని ఆయన సూచించారు.
సోషల్ మీడియా వాడుకోవాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. సోషల్ మీడియాపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు.